గుడ్ న్యూస్.. కారుణ్య నియామకాలకు ఏపీ సర్కార్ ఓకే.. 896 కుటుంబాలకు లబ్ది
ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపడతామనే తీపికబురు తెలిపింది. దీంతో 896 మంది ఉద్యోగుల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ, జిల్లా కలెక్టర్ల పరిధిలో చేపడుతారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. కారుణ్య నియామకాలను చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి.
సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగుల విషయాన్ని ఎన్ఎంయూ, ఈయూ, వైఎస్ఆర్ పీటీడీ అసోసియేషన్, ఎస్డబ్ల్యూఎఫ్ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వీరి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న 2016 నుంచి పెండింగ్లో ఉన్న 896 కారుణ్య నియామకాలను చేపడుతామని ప్రకటించింది. కారుణ్య నియామకాలు జరిపే వారి పేర్ల జాబితాను ఆర్టీసీ ఎండీ సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపి, గ్రామ, వార్డు సెక్రటరీ ఉద్యోగాల్లో ఉన్న వారిని గుర్తించి నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
మిగిలిన అభ్యర్థుల జాబితాను ఆర్టీసీ ఎండీకి పంపి వారి అర్హతల ఆధారంగా ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులుగా నియమిస్తారు. ఇంకా మిగిలి ఉంటే ఆ జాబితాను తిరిగి సంబంధిత కలెక్టర్లకు పంపుతారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విలీనానికి ముందు 896 మంది ఉద్యోగులు సర్వీసులో ఉండగా చనిపోయారు. కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీఎస్ ఆర్టీసీలోని వివిధ యూనియన్ల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలపై సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.