విఫలమే: 3 అంశాలపై ప్రతిష్టంభన.. 3వ తేదీన ఆందోళన పక్కా: ఏపీ జేఏసీ
చివరి ప్రయత్నం విఫలమయ్యింది. అవును ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ మధ్య జరిగిన చర్చలు కూడా విఫలం అయ్యాయి. ప్రధానంగా మూడు డిమాండ్లపై పీఠముడి నెలకొంది. ఇదే సిచుయేషన్ కొనసాగితే 6వ తేదీ (ఆదివారం) అర్థరాత్రి నుంచి ఏపీలో సమ్మె సైరన్ మోగనుంది. ఉద్యోగుల మూడు డిమాండ్లు తీర్చలేమని మంత్రుల కమిటీ తేల్చేసింది. అంతేకాదు ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను వెనక్కి తీసుకోవడం కుదరదని చెప్పింది. దీంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
3వ తేదీన నిర్వహించే ఛలో విజయవాడ యథాతథంగా కొనసాగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వం తమను తప్పుదోవ పట్టిస్తోందని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆరోపించారు. ఇవాళ్టి చర్చల్లో మూడే అంశాలు చెప్పామని, మంత్రుల కమిటీ కొంత సమయం తర్వాత అభిప్రాయం చెప్తామని తమను మభ్యపెట్టిందని, సాయంత్రానికి తమ డిమాండ్లు సాధ్యపడవు అని ఒక సందేశంలో రూపంలో పంపిందని బండి శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగులను భయపెట్టొద్దని, ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులను మానుకోవాలని కలెక్టర్లకు బండి శ్రీనివాసరావు సూచించారు.

చర్చల్లో పురోగతి రావాలంటే పాత జీతం ఇమ్మని ప్రభుత్వాన్ని అడిగామని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించారు. నిర్బంధపు వేతన సవరణను ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ అమలు చేయడానికి మార్చి 2022 వరకు సమయం ఉందని ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు జీవోలో పేర్కొన్నారని, రాత్రికి రాత్రి ఎందుకు జీతాలు ప్రాసెస్ చేయాలని ట్రెజరీ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారులు విశాల దృక్పథంతో ఉండాలన్నారు. ఇవాళ కొన్ని పే స్లిప్పులు చూపించారని, అందులో తమకు జీతాలు పెరిగినట్టు చూపించి, లేనిది ఉన్నట్టుగా భ్రమింప చేస్తున్నారని ఆరోపించారు.
మంత్రుల కమిటీతో చర్చలు విఫలమైనట్టే. గతంలో చర్చలకు పిలిచి ఏం చేశారో ఇప్పుడూ అదే చేశారు. కొత్త పీఆర్సీతో నష్టపోతున్నట్టు పదేపదే చెప్పాము. నేటి సమావేశంలోనూ పాత అంశాలపైనే మాట్లాడారు. మేము చెప్పిన 3 ప్రధాన అంశాలపై తేల్చాలని కోరగా, ఆ మూడు అంశాల పరిష్కారం సాధ్యపడదని బండి శ్రీనివాస రావు తెలిపారు.












Click it and Unblock the Notifications