ఏపీ పీఎస్సీ రిజల్ట్స్: హైదరాబాద్ యువతికి మూడో ర్యాంక్.. 163 పోస్టులు
ఎట్టకేలకు గ్రూప్-1 2018 ఫలితాలను ఏపీ పీఎస్సీ విడుదల చేసింది. కోర్టు కేసుల వల్ల పోస్టుల భర్తీలో జాప్యం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతం సవాంగ్ మంగళవారం ఫలితాలను ప్రకటించారు. మొత్తం 167 పోస్టుల భర్తీకి 2018లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 167 పోస్టులకు గాను 163 పోస్టులను భర్తీ కాగా... వివిధ కారణాల వల్ల 4 పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేయలేదు. అభ్యర్థులు తమ ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/లో చూడొచ్చు.
ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 67 మంది మహిళలు ఉండగా.. 96 మంది పురుషులు ఉన్నారు. టాపర్ల విషయానికి వస్తే తొలి, రెండు ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులే ఉన్నారు. మూడో ర్యాంకులో తెలంగాణకు చెందిన యువతి ఉన్నారు. ఫలితాల్లో టాపర్గా పిఠాపురానికి చెందిన రాణి సుష్మిత నిలవగా.. రెండో ర్యాంకులో కడప జిల్లాకు చెందిన శ్రీనివాసరాజు నిలిచారు. వీరిద్దరూ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఎంపికయ్యారు. ఇక మూడో ర్యాంకర్గా హైదరాబాద్కు చెందిన సంజనా సింహా నిలిచారు.
తొలి ర్యాంకుతో పాటు తొలి మూడు ర్యాంకుల్లో ఇద్దరు యువతులే నిలిచారు. ఇంటర్వ్యూల కోసం మూడు బోర్డులను ఏర్పాటు చేశామని గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. ఈ బోర్డుల ద్వారా ఇంటర్వ్యూల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. ఈ పోస్టుల భర్తీలో హైకోర్టు ఆదేశాలను పాటించామని ఆయన వివరించారు.