ఎన్నికలకు ముందు.. పవన్ కళ్యాణ్ సహా 3 ఫ్యాక్టర్స్: జగన్ పార్టీలో సరికొత్త ఉత్సాహం
అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఓ వైపు తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేతలు తమ పార్టీలో చేరుతుండటం, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ అభ్యర్థుల ఎంపిక అంశానికి సంబంధించిన కార్యక్రమం ఇప్పుడిప్పుడే ప్రారంభించడం.. వైసీపీలో ఉత్సాహం నింపుతోందట. దానికి తోడు పలు సర్వేలు వైసీపీదే గెలుపు అని చెబుతున్నాయి.
షరతుల్లేవు, పవన్ కళ్యాణ్ పిలవలేదు: జగన్తో ఆమంచి భేటీ, కుటుంబంతో సహా..
సర్వేల ఉత్సాహం
ఇటీవల పలు జాతీయ మీడియా సంస్థలు చేసిన సర్వేల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదని తేలింది. 25 లోకసభ స్థానాలకు గాను ఏపీలో దాదాపు 23 లోకసభ సీట్లు వస్తాయని తమ సర్వేలో తేలిందని తెలిపారు. ఈ లెక్కన చూస్తే వైసీపీ 120 నుంచి 150 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అందుకే టీడీపీ నుంచి వైసీపీకి వలసలు
పలు జాతీయ సంస్థల సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉండటం దానికి తోడు తాము కోరుకున్న సీటు దక్కకపోవడం తదితర కారణాలతో ఎమ్మెల్యేలు కడప జిల్లా నుంచి మల్లికార్జున రెడ్డి, ప్రకాశం జిల్లా నుంచి ఆమంచి కృష్ణమోహన్, విశాఖపట్నం నుంచి ఎంపీ అవంతి శ్రీనివాస్లు వైసీపీలో చేరారు. చంద్రబాబుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పార్టీ మారుతున్న వారు దుమ్మెత్తి పోస్తున్నారు. ఎన్నికలకు ముందు డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్
సార్వత్రిక ఎన్నికలు మరో రెండు మూడు నెలలు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి సమయంలోను పవన్ జనసేన కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేనలో ఉన్నతస్థాయిలో పని చేసిన, సామాజిక సేవదృక్పథం కలిగిన వారు చేరుతున్నారని అంటున్నారు. కానీ ఎన్నికలు అంటే అదొక్కటే సరిపోదని గుర్తు చేస్తున్నారు. టీడీపీ, వైసీపీలకు దాదాపు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. మహా అయితే యాభై సీట్లలోపు ఆ పార్టీలో పోటాపోటీ ఉండే అవకాశం ఉండవచ్చునని అంటున్నారు. కానీ 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 లోకసభ స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ కేవలం ఒకరిద్దరిని ప్రకటించడం మినహా ఇంకా కసరత్తు చేస్తున్నారని, ఇంకా నేతల కోసం వెయిటింగ్ కొనసాగుతున్నట్లుగా ఉందని, ఇప్పటికే పలువురు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉండెనని అంటున్నారు. ఎన్నికలు సమీపించినప్పటికీ పవన్ యాక్టివ్ కాలేకపోవడం తమకే లాభమని వైసీపీ భావిస్తోందట.