బాబే రెచ్చగొట్టారు.. మరీ లోకేశ్ ఎందుకు వచ్చినట్టు.. అంబటి రాంబాబు ప్రశ్న
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన రోజు కూడా అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ జరిగింది. 3 రాజధానులపై జగన్ ప్రకటన.. చంద్రబాబు ఖండించడంతో రియాక్షన్స్ కొనసాగుతున్నాయి. దీనిపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా రియాక్ట్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘంగా కొనసాగాయని రాంబాబు అన్నారు. కరోనా వల్ల గతంలో సమావేశాలు అనుకున్నట్టుగా జరగలేదని... ఈ సారి మాత్రం 12 రోజుల పాటు అనేక అంశాలపై చర్చ జరిపి, నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.

మరీ లోకేశ్ ఎందుకు..?
ప్రతిపక్ష టీడీపీ తీరుపై విమర్శలు చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సభకు రానని భీష్మ ప్రతిజ్ఞ చేశారని... మరి వాళ్ల అబ్బాయి లోకేశ్, ఇతర సభ్యులు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఈ ద్వంద్వ వైఖరి ఎందుకని అడిగారు. సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి టీడీపీ సభ్యులు దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. తొలిరోజే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారని... తొలిరోజు నుంచి చివరి వరకు జంగారెడ్డిగూడెం మరణాల గురించే వాళ్లు మాట్లాడారని చెప్పారు.

సహజ మరణాలే...
వాస్తవానికి జంగారెడ్డిగూడెంలో సంభవించినవి సహజ మరణాలేనని, వాటిని సారా మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు బయట ఉండి వారి పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టారని అన్నారు. అందుకే వారు విజిల్స్ తెచ్చి సభని ఎగతాళి చేశారని, మరుసటి రోజు చిడతలు తెచ్చి వాయించారని దుయ్యబట్టారు. అసహనంతో ఉన్న చంద్రబాబు వ్యవస్థలను అగౌరవపరిచేలా వ్యవహరించారని అన్నారు.

జగన్ ప్రకటన.. చంద్రబాబు రియాక్షన్
3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో నిన్న సీఎం జగన్ కామెంట్ చేశారు. వెంటనే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అసెంబ్లీలో మూడు ముక్కలాటకు సీఎం జగన్ తెరతీశారని చంద్రబాబు అన్నారు. 3 రాజధానులపై మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదన్నారు. మోసాలు, ఘోరాలు చేయడంలో జగన్ దిట్టన్నారు. అధికార వికేంద్రీకరణ కాదని, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని ఆయన సూచించారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావడం దురదృష్టకరం అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఒక శని గ్రహంలా తయారయ్యారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications