తెలంగాణే స్ఫూర్తి: అందుకే పార్టీ ఏర్పాటు చేశా.. పవన్ కల్యాణ్
తెలంగాణ స్ఫూర్తి తన గుండెల్లో ధైర్యాన్ని నింపిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ పోరాట స్ఫూర్తే జనసేన పార్టీని స్థాపించేలా చేసిందని వివరించారు. ఉద్యమ విద్యుత్ను తనలో ప్రవహింపజేసిందని పేర్కొన్నారు. ప్రపంచం మారాలి, సమాజం మారాలని కోరుకుంటామని, కానీ ఎందులోనైనా అడుగుపెడితే తప్ప అనుభవం రాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ తెలంగాణ విభాగం క్రియాశీలక కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చ జరిగింది.
గెలుస్తామో, ఓడిపోతామో తెలియదని.. రాజకీయాల్లోకి వస్తుంటే మాత్రం భయపెట్టారని పవన్ కల్యాణ్ వివరించారు. మార్పు కోసం, బలమైన సామాజిక చైతన్యం కోసం రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. డబ్బులతో కొనలేని కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తేవాలన్నది తన ఆశయం అని వివరించారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టమైన పని అని చెప్పారు. అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ తెలియజేశారు. ప్రజా సేవే తనకు పరామావధి అని ఆయన స్పష్టంచేశారు.
కులం, మతం, రంగు, ప్రాంతం తెలియకుండా జరిగిపోయే అంశాలు అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో వాటి ప్రస్తావన ఉండకూడదని పవన్ కల్యాణ్ అన్నారు. కులాలను రెచ్చగొట్టాలని ఏనాడూ ప్రయత్నించలేదని వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిగజారిపోయిందని ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి నిరోధకులు ఎవరైనా సరే తనకు బద్ధ శత్రువులే అని పవన్ కల్యాణ్ కామెంట్ చేశారు. అనుకున్న స్థాయిలో డెవలప్ జరగాల్సిందేనని తేల్చిచెప్పారు.
ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ బిజీగా ఉన్నారు. తెలంగాణపై అంతగా ఫోకస్ చేయలేదు. ఈ క్రమంలోనే జనసేన క్రియాశీలక కార్యకర్తలను మీట్ అయ్యారు. పార్టీ నిర్మాణం.. బలోపేతం గురించి డిస్కష్ చేశారు. తెలంగాణలో కూడా పార్టీ ప్రభ వెలగాలని.. అందుకోసం ఏమేం చేయాలనే అంశంపై కూడా డిస్కష్ చేశారు. తాను అన్నీ వేళల్లో అందుబాటులో ఉంటానని.. సమస్యలను లేవనెత్తి పరిష్కారం దిశగా మరింత పోరాడాలని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. ఇందులో సందేహానికి తావులేదని చెప్పారు.