రాజకీయాలపై ఆసక్తి లేదు, కానీ: జగన్ను ఎందుకు కలిశానో చెప్పిన నాగార్జున
హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాను కలవడంపై వివిధ రకాలుగా ప్రచారం జరుగుతుండటంతో సినీ నటుడు అక్కినేని నాగార్జున మంగళవారం స్పందించారు. తన భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన తేల్చి చెప్పారు. నాగార్జున వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఉందని.. గుంటూరు సీటును తనకు కావాల్సిన వ్యక్తికి ఇవ్వాలని.. తనకు తెలిసిన వ్యాపారవేత్తకు టిక్కెట్ ఇవ్వాలని.. కోరేందుకు నాగార్జున కలిసినట్లుగా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.

రాజకీయాలపై ఆసక్తి లేదు
తాను జగన్ను ఎందుకు కలిశానో ఆ తర్వాత నాగార్జున చెప్పారు. వైసీపీ అధినేతతో భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తేల్చి చెప్పారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు. తద్వారా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చేశారు. అలాగే, తాను ఎవరి కోసమో టిక్కెట్ అడిగేందుకు కూడా కలవలేదని చెప్పారు.

జగన్ను ఎందుకు కలిశానంటే
వైయస్ జగన్ తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని నాగార్జున చెప్పారు. అందుకే కలిసినట్లు తెలిపారు. ఇటీవల ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారని, అది విజయవంతమైనందుకు తాను అభినందించానని చెప్పారు. అంతేతప్ప, తాను రాజకీయాల కోసం కలవలేదని చెప్పారు. తమ మధ్య రాజకీయ పరమైన చర్చ జరగలేదన్నారు. కాగా జగన్, నాగార్జునలు దాదాపు అరగంట పాటు చర్చించారని తెలుస్తోంది.

నాగార్జున - జగన్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడ్డాయి. మరో రెండో మూడు నెలల్లో ఏపీ, తెలంగాణలలో లోకసభ, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో పలువురు టీడీపీ నేతలు వరుసగా వైసీపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున వైసీపీ అధినేతతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications