మేం రాం: ఎస్ఈసీ భేటీకి జనసేన డుమ్మా.. కారణమిదేనా..?
కొత్త ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని దూకుడుగా పనిచేస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రకటన జారీచేశారు. దీంతో విపక్షాలు ఒంటికాలిపై లేచాయి. ఈ క్రమంలో శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. దానిని బహిష్కరిస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిర్ణయం ఏకపక్షంగా ఉందన్నారు. అందుకు నిరనసనగా ఎస్ఈసీ నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు.
సమావేశానికి సంబంధించి గురువారం సాయంత్రం ఎస్ఈసీ ఆహ్వానాన్ని పంపారని పవన్ తెలిపారు. ఈలోపే పాత నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని ఎలా చెప్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ నెల 8న పోలింగ్, 10న ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించడం అప్రజాస్వామిక చర్యన్నారు. ఈ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొన్నారు. కోర్టు తీర్పు రాక ముందే ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు.
తొందరపాటు నిర్ణయం అధికార పార్టీకి లబ్ది చేకూర్చడానికేనని జనసేన అభిప్రాయపడుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అందుకోసమే సమావేశానికి రావడం లేదని చెప్పారు. ఎస్ఈసీ చర్య జనానికి బాగుండాలని సూచించారు. కానీ ప్రభుత్వానికి అనువుగా ఉండొద్దని సూచించారు.