వంగవీటి రంగాకు టీ అందించా- అలా జరిగితే బీజేపీకి గుడ్ బై: చంద్రబాబుకు అప్పుడే చెప్పా
మచిలీపట్నంలో నిర్వహించిన సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ఒంటరిగా పోటీ చేయట్లేదని స్పష్టం చేశారు.
మచిలీపట్నం: జనసేన పార్టీ.. ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఇవ్వాళ మచిలీపట్నంలో భారీ ఎత్తున ఆవిర్భావ సభను నిర్వహించింది. ఇది- జనసేన 10వ ఆవిర్భావ సభ. అధినేత పవన్ కల్యాణ్ ఈ సభకు విజయవాడ నుంచి వారాహి వాహనంలో మచిలీపట్నానికి బయలుదేరినప్పటికీ.. గమ్యం చేరలేకపోయారు. సమయం మించిపోతోండటం వల్ల వారాహి నుంచి కారులో వేదికకు చేరుకున్నారు.

మచిలీపట్నంలో పవన్ కల్యాణ్..
మచిలీపట్నం సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై తన వైఖరేమిటనేది ఈ సభ సాక్షిగా తేటతెల్లం చేశారు. జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏమిటనేది వెల్లడించారు. కులాల రాజకీయం చేయబోమంటూనే ఆయన కులం గురించి ఎక్కువ సేపు తన ప్రసంగంలో ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై అప్పుడే విమర్శలు కూడా మొదలయ్యాయి.

ఒంటరిగా పోటీ చేయం..
2024 సార్వత్రిక ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కొనదలచుకోలేదని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి బలిపశువు కాబోమని అన్నారు. మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ తమతో కలిసి రావట్లేదనీ వ్యాఖ్యానించారు. తనతో పాటు జనసేన అభ్యర్థులందరూ అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా వ్యూహ రచన చేస్తోన్నానని పేర్కొన్నారు. తాము ఎవరితో అయితే కలవకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందో అదే జరిగి తీరుతుందని తేల్చి చెప్పారు. వారితోనే ఎన్నికలకు వెళ్తామనీ అన్నారు.

గెలుపుపై సంపూర్ణ నమ్మకం ఉంటేనే..
ఈ ప్రజా క్షేత్రంలో తాను గెలుస్తాననే నమ్మకం వచ్చిన రోజు మాత్రమే ఒంటరిగా పోటీగా చేస్తానని పవన్ కల్యాణ్ కుండబద్దలు కొట్టారు. క్షేత్ర స్థాయిలో సానుకూలంగా నివేదిక వచ్చిన రోజున ఈ నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నారు. అప్పటివరకూ పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తాననీ పేర్కొన్నారు. దేశ రక్షణ, బలమైన నాయకత్వం కోసమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీకి మద్దతు ఇచ్చానని, బీజేపీ తనతో కలిసి రావట్లేదని చెప్పారు.

కావాల్సింది గజమాలలు కాదు..
తనకు ఇప్పుడు కావాల్సింది గజమాలలు కాదని, ఓట్లు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జనసేన కు అవకాశం ఇవ్వాలని, తమకు అండగా నిలవాలని కోరారు. ఖచ్చితంగా మార్పు చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు పవన్ కల్యాణ్. ఏపి ఇప్పటివరకు లేని అభివృధి తాను చేసి చూపిస్తానని భరోసా ఇచ్చారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని, కమ్మ, రెడ్డితో గొడవలు వద్దని, బీసీలను దగ్గర చేసుకోవాలని సూచించారు.

ముస్లింలకు హామీ..
బీజేపీతో పొత్తులో ఉన్నందున.. పార్టీలోని ముస్లింలు వెళ్లిపోతామంటోన్నారని పవన్ కల్యాణ్ చెప్పారు. వారికి తాను ఇచ్చే హామీ ఒక్కటేనని, ముస్లింల మీద ఏలాంటి దాడుల జరిగినా తాను బీజేపీతో పొత్తులో నుంచి బయటకి వచ్చేస్తానని తేల్చి చెప్పారు. చిన్న స్థాయిలో అమరావతి నిర్మిస్తే సరిపోతుందని తాను ఆనాడే చంద్రబాబుకు చెప్పానని, దానికి అప్పుడు నన్ను తప్పుపట్టారని పవన్ గుర్తు చేశారు. సంపూర్ణ మధ్యపాన నిషేదం సాధ్యం కాదని కూడా ఎప్పుడో చెప్పానని వివరించారు.

రంగాకు టీ ఇచ్చా..
తాను చిన్నప్పటి నుంచి దివంగత కాపు నేత వంగవీటి రంగాను చూస్తూ పెరిగానని పవన్ కల్యాణ్ అన్నారు. తన ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు టీ అందించానని గుర్తు చేసుకున్నారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేను అని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేశారని పవన్ కల్యాణ్ కాపులను నిలదీశారు. తాను కాపులకు అండగా ఉంటానని చెప్పారు. వారంతా ఓటేసి ఉంటే గెలిచేవాడినని అన్నారు.












Click it and Unblock the Notifications