గుడ్ న్యూస్: అర్చకుల వేతనాలు పెంపు.. ఆర్నెల్లలో మరోసారి హైక్
అర్చకులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ తెలియజేసింది. దేవాదాయ శాఖ పరిధిలో గల ఆలయాల అర్చకులకు జీతాలు పెంచింది. 25 శాతం జీతం పెంచుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయశాఖపై సీఎం జగన్ సమగ్ర రీతిలో సమీక్షించారు. అర్చకుల సమస్యలపై సీఎం జగన్ దృష్టి సారించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. వంశపారంపర్యంగా అర్చకుల నియామకం చేపడుతున్నామని ఆయన తెలిపారు.
దేవాదాయశాఖపై నిర్వహించిన సమీక్షలో అర్చకులకు ఇళ్ల కేటాయింపుపై ముందుకెళ్లాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ఆలయాల్లో టికెట్ల జారీకి ఆన్ లైన్ విధానం అమలు చేయాలని సూచించినట్లు తెలిపారు. సమగ్ర భూ సర్వేలో ఆలయ భూములకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చెప్పినట్లు మంత్రి చెప్పారు. దేవాదాయ శాఖ భూముల సర్వే కూడా చేపట్టనున్నట్లు మంత్రి వెల్లపంల్లి చెప్పారు. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్కు ఒక ఐపీఎస్ అధికారి నేతృత్వంలో పర్యవేక్షించాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు.
దసరా నవరాత్రులు, బ్రహ్మోత్సవాలు వస్తున్న నేపథ్యంలో సీఎంకి ఆహ్వానం అందించామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. గత వేసవిలోనూ అర్చకుల జీతాన్ని ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. కేటగిరి-1 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.15,625కి పెంచారు. కేటగిరీ-2 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ఇప్పుడు మరోసారి వారి వేతనాన్ని పెంచుతూ రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.
మరోసారి అర్చకుల వేతనం పెంచుతూ రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. అర్చకులు హర్షం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లకు సానుకూలంగా ఉండటమే కాకుండా.. వేతనం పెంచినందుకు థాంక్స్ తెలిపారు. తమపై దయతలచిన ఏపీ సర్కార్కు వారు ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే ప్రార్థన మందిరాలకు జనం తాకిడి ఉంది. ఆలయాలు/ మసీదు/ చర్చ్లకు జనం వెళుతున్నారు. కానీ భౌతిక దూరం పాటిస్తూ.. మాస్క్ ధరించి.. శానిటైజర్ చేసుకుంటున్నారు.