విలువలతో పెరిగాం.. కామెంట్లు క్షమార్హం కావు: పురందేశ్వరి విసుర్లు
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు అవమానం జరిగింది. అతని భార్య గురించి అధికార పార్టీ నేతలు నీచంగా మాట్లాడారు. దీంతో చంద్రబాబు చాలా బాధపడ్డారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏడ్చారు. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నేతల తీరు గురించి అందరూ తప్పుపడుతున్నారు. చంద్రబాబుకు ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలో భువనేశ్వరి సోదరి.. పురందేశ్వరి స్పందించారు. తన సోదరిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె స్పందించారు.
ఏపీ అసెంబ్లీలో తన భార్య భువనేశ్వరిని దారుణంగా మాట్లాడారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బాధపడ్డారు. ప్రెస్ మీట్ లో కన్నీటి పర్యంతం కావడం మీడియాలో ప్రముఖంగా కనిపించింది. ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. అసెంబ్లీలో తన సోదరి నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు దూషించారనే ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ మంచి పద్దతి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇదీ హర్షించదగిన పరిణామం కాదని వివరించారు.

భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా జరిగిన ఘటనతో తన మనసు నిజంగా గాయపడిందని పురందేశ్వరి అన్నారు. అక్కాచెల్లెళ్లుగా ఎన్నో విలువలతో పెరిగాం అని చెప్పారు. ఈ ఘటనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలను అందరూ గమనిస్తున్నారని వివరించారు. అధికార మదంతో ఇలా వ్యవహరించడం సరికాదని కామెంట్ చేశారు.
ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు అర్ధాంగిని అవమానిస్తూ అధికారపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలను నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఖండించారు. ఆడపడుచులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన తెలిపారు. ఏదైనా ఉంటే నేతలపై కామెంట్ చేయడం జరుగుతుందన్నారు. కానీ ఆడవాళ్ల విషయం తీయడం మాత్రం హర్షించదగిన పరిణామం కాదన్నారు.
ఏపీ శాసన సభలో సభ్యులు వ్యవహరించిన తీరు సరైన విధానం కాదని, ఏ పార్టీ వారైనా హద్దులు దాటి, అసభ్య పదజాలంతో విమర్శలు చేసుకోవడం అత్యున్నత రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక విలువలను పతనం చేయడమేనని అభిప్రాయాలు వస్తున్నాయి. ఉన్నత విలువలతో ప్రజా సమస్యలపై చర్చలకు వేదికగా నిలవాల్సిన చోట ఇలాంటి పరిణామాలు జరగడం శోచనీయమన్నారు. వ్యక్తిత్వం లేని వారిని చట్టసభలకు పంపితే పరిణామాలు ఇలానే వుంటాయన్నారు.












Click it and Unblock the Notifications