175-160 ఇదీ ఏపీలో సీట్లపై టీడీపీ, వైసీపీ నేతల ధీమా
ఏపీలో అప్పుడే సీట్ల రగడ మొదలైంది. మాజీమంత్రి అచ్చెన్నాయుడు 160 సీట్లు అంటే.. ఒక ఆకు ఎక్కువే చదివిన మంత్రి వెల్లంపల్లి మొత్తం చోట్ల తామే గెలుస్తామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సీటు సహా రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో వైసీపీ విజయం సాధించనుందని ఆ పార్టీ కీలక నేత, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు రెడీ కావాలంటూ టీడీపీ చేసిన ప్రకటనకు కౌంటర్ ఇచ్చేందుకు బుధవారం మీడియా ముందుకు వచ్చారు
జగన్ను ఓడించడం..
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓడించడం ఏ ఒక్కరి తరం కూడా కాదని స్పష్టం చేశారు. చంద్రబాబుతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడులపై వెల్లంపల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు పూర్తిగా మతి భ్రమించిందని, వచ్చే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఆయన ఓడిపోతారని ఆయన జోస్యం చెప్పారు.
కమెడీయన్
నారా లోకేశ్ ను రాజకీయాల్లో ఓ కమెడియన్గా అభివర్ణించారు. లోకేశ్ కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు సొంత పార్టీపై తిరుపతిలో చేసిన వ్యాఖ్యలను మంత్రి గుర్తు చేశారు. అన్నం తినేటప్పుడు ఎవరూ అబద్ధాలు ఆడరని, అందుకే టిఫిన్ చేస్తూ టీడీపీ పని అయిపోయిందంటూ నిజం మాట్లాడారన్నారు. ఇప్పటికే ఏపీలో టీడీపీ కేడర్ చెల్లాచెదురు అయిపోయిందని, కేడర్ను కాపాడుకునేందుకే టీడీపీ నేతలు ముందస్తు ఎన్నికలు అంటూ హడావిడి చేస్తున్నారని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు.
అచ్చెన్నాయుడు లెక్క ఇదీ
అంతకుముందు ఏపీలో ఎన్నికల గురించి, ఫలితాల గురించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఏ క్షణంలో అయినా ఎన్నికల రావొచ్చన్నారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందని నిద్రపోవద్దని.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని చెప్పడమే కాదు.. ఈసారి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా అచ్చెన్న చెప్పేశారు. ఈసారి కచ్చితంగా టీడీపీదే విజయం అని, 160 స్థానాల్లో గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిద్రలో లేచి రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తున్నట్లు లెటర్ ఇచ్చినా.. ఆశ్చర్యం అక్కర్లేదన్నారు.
మోసం, నయవంచన
రైతులను జగన్ ప్రభుత్వం అడుగడుగునా ముంచిందని ఆరోపించారు. ఉద్యోగుల నుంచి పేదల దాకా ప్రతి రంగాన్ని ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. టీడీపీ హయాంలో రైతుల శ్రేయస్సుకు చేసిన దానిలో పావువంతు అయినా చేశారా అని ప్రశ్నించారు. రైతు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని.. రైతులకు ఉరితాళ్లుగా మారిందన్నారు. ఈ ముఖ్యమంత్రి హయాంలో రైతులకు యూరియా కూడా దొరకడం లేదని వాపోయారు.