వైసీపీ నుంచి కొత్తపల్లి సుబ్బరాయుడు ఔట్.. సస్పెన్షన్ వేటు
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, టికెట్ గురించి మాటలాడిన మాజీమత్రి కొత్తపల్లి సుబ్బరాయుడిపై వైఎస్ఆర్ సీపీ వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రకటన చేసింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
వ్యతిరేక కార్యకలాపాలు..
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. తనకు వ్యక్తిగత ఓటింగ్ ఉందని కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. అలా ప్రకటించిన 24 గంటల్లోపే కొత్తపల్లిని పార్టీ నుంచి బహిష్కరించారు. క్రమశిక్షణ సంఘం సిఫార్సుతో జగన్ కొత్తపల్లిని సస్పెండ్ చేశారు.
నరసాపురం నుంచి పోటీ..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తనకు టిక్కెట్ కావాలని ఏ పార్టీని అడగలేదు. తనకంటూ వ్యక్తిగత ఇమేజ్ ఉంది. అన్ని వర్గాల ప్రజలు తనను ఆదరిస్తారు. గౌరవిస్తారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా చేసిన అనుభవం ఉంది. కచ్చితంగా నేను ఎమ్మెల్యేగా గెలుస్తా. ఈ విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదన్నారు.
కేసు పెట్టడం
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానా ? ఇతర పార్టీలకు మద్దతుగా ఉంటానా ? అని ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకే క్లారిటీ ఇస్తున్నానని తెలిపారు. నరసాపురంలో జిల్లా కేంద్రం ఏర్పాటుపై ప్రజల తరపున ఉద్యమిస్తే.. తనపై ఏ 1 ముద్దాయిగా కేసు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తను ఎవరిని బెదిరించలేదు. గొడవలు సృష్టించ లేదు. శాంతియుతంగా ఉద్యమించానని తెలిపారు. తనపై ఏ కేసు పెట్టినా పట్టించుకోనని.. ప్రజల మధ్యనే ఉంటా.. సమస్యలపై పోరాటం చేస్తానని సుబ్బారాయుడు స్పష్టం చేశారు.