చెన్నై టీమ్కు తెలుగోడు లేని లోటు: అంబటి అవసరం: గాయంపై ఇదీ అప్డేట్: రీఎంట్రీపై ధోనీ
దుబాయ్: ఐపీఎల్-2020 సీజన్ టైటిల్ హాట్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. వరుసగా రెండో మ్యాచ్లోనూ పరాజయం పాలైంది. ఈ సీజన్ తొలి మ్యాచ్లో బోణీ కొట్టినప్పటికీ.. ఆ తరువాత ఆడిన రెండింట్లోనూ బోల్తా కొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్లో సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడలేకపోతోంది. టీమ్ మొత్తం బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్తో నిండిపోయి ఉన్నప్పటికీ.. అందుకు తగ్గట్టుగా ఆడట్లేదు. అన్ని విభాగాల్లోనూ విఫలమౌతోంది. ఓటమిని కొని తెచ్చుకుంటోంది. మూడు మ్యాచ్లల్లో రెండింట్లో మట్టికరిచింది ధోనీ సేన.
కోహ్లీ, అనూష్కశర్మపై సెక్సీయెస్ట్ కామెంట్స్ రచ్చ: కామెంటరీ బాక్స్లో గవాస్కర్: మరోసారి క్లారిటీ
అంబటి లేని లోటు.. క్లియర్గా..
ఈ రెండు వరుస పరాజయాలు.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో తెలుగోడు అంబటి రాయుడు లేని లోటును స్పష్టం చేస్తున్నాయనడంలో సందేహాలు అక్కర్లేదు. చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన ఈ సీజన్ తొలి మ్యాచ్లో అంబటి చెలరేగిపోయి ఆడిన విషయం తెలిసిందే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో అంబటి రాయుడు భారీ స్కోరును నమోదు చేశాడు. 48 బంతుల్లో 71 పరుగులు చేశాడు. దీనితో ముంబై ఇండియన్స్ విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే 19.2 ఓవర్లలో ఛేదించింది.
వరుసగా రెండో ఓటమి..
ఆ తరువాత ఆడిన రెండు మ్యాచుల్లోనూ చెన్నై సూపర్కింగ్స్ ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో భారీ స్కోరును ఛేదించలేకపోయింది. శుక్రవారం రాత్రి నాటి మ్యాచ్లోనూ ఇదే పరిస్థితి. ఢిల్లీ కేపిటల్స్ నిర్దేశించిన 175 పరుగులను అందుకోలేక చతికిలపడింది. ఏడు వికెట్లను కోల్పోయి 131 పరుగుల వద్దే ఆగిపోయింది. 44 పరుగుల తేడాతో మ్యాచ్ను ప్రత్యర్థికి ధారదాత్తం చేసింది చెన్నై. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోతున్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోతున్నారు. టెయిలెండర్లదీ అదే పరిస్థితి.
మిడిల్ ఆర్డర్ బలహీనంగా..
అంబటి రాయుడి స్థానంలో తుది జట్టులోకి తీసుకున్న కొత్త ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ వరుసగా రెండోమ్యాచ్లోనూ విఫలం అయ్యాడు. 10 బంతులను ఆడిన అతను అయిదు పరుగులే చేయగలిగాడు. మిడిల్ ఆర్డర్లో కేదార్ జాదవ్ గానీ, రవీంద్ర జడేజా తమ స్థాయికి తగ్గట్టుగా పరుగుల వరదను పారించట్లేదు. దాని ఫలితంగా- వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓటమిని మూటగట్టుకుంది ధోనీ సేన. మిడిలార్డర్లో అంబటి రాయుడు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ జరగడానికి కొన్ని గంటల ముందు అంబటి గాయపడ్డాడు.
నెక్స్ట్ మ్యాచ్కు అందుబాటులో..
అంబటిపై రీఎంట్రీపై ధోనీ తాజా అప్డేట్ ఇచ్చాడు. తదుపరి మ్యాచ్కు అందుబాటులోకి వస్తాడని వెల్లడించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తన తరువాతి మ్యాచ్ను వచ్చేనెల 2వ తేదీన ఆడబోతోంది. అదీ సన్ రైజర్స్ హైదరాబాద్ మీద. దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియం.. ఈ మ్యాచ్కు వేదికగా మారనుంది. ఈ మ్యాచ్.. ఈ రెండు జట్లకూ కీలకమే. సన్రైజర్స్ హైదరాబాద్ కూడా తాను ఆడిన తొలి మ్యాచ్లో ఓడిపోయింది. అటు ధోనీ సేన.. ఇటు డేవిడ్ వార్నర్ టీమ్.. విజయం కోసం కొదమసింహాల్లా పోరాడటం ఖాయంగా కనిపిస్తోంది. అదే మ్యాచ్లో అంబటి రాయుడు కూడా అందుబాటులోకి వస్తే.. ఆ మజా వేరుగా ఉంటుంది.