Anantapur: కన్నతల్లినే కాటేయబోయిన కామాంధుడు: చీరకొంగే ఉరితాడుగా..ఉసురు తీసిన తల్లి..!
అనంతపురం: నవ మాసాలు మోసి కని, పెంచిన కన్నతల్లినే కాటేయబోయాడు ఓ కామాంధుడు. మమతానురాగాలు పంచిన అమ్మపై చెరబట్టబోయాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడబోయాడు. దీన్ని పసిగట్టిన ఆ తల్లి ప్రతిఘటించింది. కామంతో కళ్లు మూసుకునిపోయిన కుమారుడి ఉసురు తీసింది. భర్తతో కలిసి కుమారుడిని హత్య చేసింది. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
మృతుడి పేరు నారాయణ స్వామి. అనంతపురం జిల్లాలోని లేపాక్షి మండలం శిరివరం గ్రామానికి చెందిన వ్యక్తి. నారాయణ స్వామికి తల్లి కదిరమ్మ, తండ్రి నరసింహప్పలతో కలిసి నివసిస్తున్నారు. ఆరేళ్ల కిందట నారాయణ స్వామికి వివాహమైంది. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చాలాకాలం నుంచి నారాయణ స్వామి మద్యానికి బానిస అయ్యాడు. ఏ పనీ చేయకుండా జులాయిగా తిరిగే వాడు. రాత్రయ్యే సరికి మద్యం మత్తులో మునిగిపోయే వాడు.
భర్త వైఖరి నచ్చక అతని భార్య మూడు నెలల కిందట పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం సాయంత్రం ఎప్పట్లాగే నారాయణ స్వామి మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. తల్లి కదిరమ్మ, తండ్రి నరసింహప్పతో ఘర్షణకు దిగాడు. మద్యం మత్తులో తూలుతున్న తన కుమారుడిని నచ్చజెప్పడానికి ఆమె ఎంత ప్రయత్నించినప్పటికీ.. వినిపించుకోలేదు. తల్లి అని కూడా చూడకుండా చితకబాదాడు. ఆమె చీరను లాగేసి, అత్యాచారానికి పాల్పడబోయాడు.
దీనితో ఆ వృద్ధ దంపతుల ఆగ్రహం కట్టలు తెగింది. తన చీరనే ఉరితాడుగా మార్చిందా ఆ తల్లి. భర్త సహకారంతో చీర కొంగును నారాయణ స్వామి మెడకు బిగించి, ఊపిరి ఆడకుండా చేసింది. దీనితో నారాయణ స్వామి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. అనంతరం వారిద్దరూ లేపాక్షి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. జరిగిన విషయాన్నంతటినీ పోలీసులకు వివరించారు. లేపాక్షి ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని హిందూపురం ఆసుపత్రికి తరలించారు. అత్యాచారాన్ని ప్రతిఘటించే సందర్భంలో ఈ హత్యోదంతం చోటు చేసుకున్నందున.. వారికి శిక్ష తక్కువగా పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.