21 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు: అధికారులపైనా..
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 21 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అర్హత లేకపోయినా ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నట్లు రీ వెరిఫికేషన్లో తేలడంతో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు నగరపాలక అధికారులు తెలిపారు.
వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టులు కేటాయించారు. ఈ పోస్టుకు నిబంధనల ప్రకారం బీఏ ఆర్ట్స్, హ్యుమానిటీస్ అర్హత ఉండాలి. కానీ, కొందరు బీకాం, బీఎస్సీ అర్హతతో పరీక్షలు రాశారు.

ఆ తర్వాత వచ్చిన మెరిట్ మార్కులతో ప్రాథమికంగా ఎంపికైన వారు సర్టిఫికెట్ల పరీశీలనకు హాజరయ్యారు. అక్కడ కూడా సమస్య లేకుండా ఎంపికయ్యారు. నియామక పత్రాలు కూడా అందుకున్నారు. అధికారులు కూడా ఎంపిక సమయంలో అర్హతలను పరిశీలించకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో తమకు డిగ్రీలో బీఎస్సీ, బీకాం అర్హత ఉన్నా నియామక పత్రాలివ్వలేదని.. అదే అర్హత ఉన్న కొందరికి మాత్రం ఇచ్చారని పలువురు అభ్యర్థులు నగర కమిషనర్ తోపాటు జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో నియామకాలపై దర్యాప్తు జరపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అర్హత లేకున్నా బీఎస్సీ, బీకాం అభ్యర్థులకు నియామకపత్రాలు ఎలా దక్కాయని విచారించారు. రీవెరిఫికేషన్లో 21 మంది అనర్హులకు ఉద్యోగ నియామక పత్రాలు అందాయని తేలింది. దీంతో ఈ విషయాన్ని జాయింట్ జాయింట్ కలెక్టర్, కమిషనర్.. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.. నియామక పత్రాలు తీసుకున్న 21 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించి అర్హత లేకపోయిన వారికి నియామక పత్రాలు ఇచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలో 15 మంది మున్సిపల్ అధికారులకు నోటీసులు జారీ చేశారు. వారిపై కూడా క్రిమినల్ కేసు లేదా సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications