టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే
TDP Janasena BJP alliance: ఈ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ.. జనసేన, భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ప్రభావం సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవాల్సి వస్తోంది.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మరో సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు అత్తర్ చాంద్ భాషా కూడా బయటికి రావడం దాదాపుగా ఖాయమైంది. టీడీపీకి ఆయన గుడ్బై చెప్పారు. రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి పంపించారు.

సత్యసాయి పుట్టపర్తి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన అత్తర్ చాంద్ భాషాకు టికెట్ దక్కలేదనే విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో చాంద్ భాషా.. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కదిరి నుంచి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన పార్టీ ఫిరాయించారు. టీడీపీ కండువా కప్పుకొన్నారు.
2019 ఎన్నికల సమయంలోనే ఆయనను పక్కనపెట్టారు చంద్రబాబు. టికెట్ ఇవ్వలేదు. కందికుంట వెంకటప్రసాద్నే బరిలో దింపారు అప్పట్లో. ఈ సారి కూడా కదిరి టికెట్ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కందికుంటకే ఇచ్చారు. దీనితో టీడీపీని వీడారు చాంద్ భాషా.
నేడు కదిరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈ సాయంత్రం కదిరికి రానున్నారు జగన్. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక పీవీఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరవుతారు. ఆ సమయంలోనే అత్తర్ చాంద్ భాషా.. వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
రాజీనామా చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి గతంలో టీడీపీలో చేరానని, తనకు అవమానాలు తప్ప తగిన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తనకు ఎన్నో హామీలు ఇచ్చి, ఏ ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ముస్లిం మైనారిటీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని టీడీపీలో కొనసాగడం సహేతుకం కాదనే ఉద్దేశంతోనే పార్టీని వీడుతున్నానని చాంద్ బాషా చెప్పారు.












Click it and Unblock the Notifications