పోలీసులతో బూట్లు నాకిస్తా, త్వరలోనే ఎన్నికలు..అంతా చంద్రబాబు వల్లే: జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు సాక్షిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులను కించపరుస్తూ మాట్లాడారు. జేసీ అలా కామెంట్లు చేస్తుంటే.. చంద్రబాబు కూడా తల ఊపుతూ అతనికి వంతపాడినట్టు వ్యవహారించారు. బుధవారం అనంతపురంలో జరిగిన టీడీపీ సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అధికారంలోకి వస్తే..
ఎస్పీ, ఆ స్థాయి పైన అధికారులు గానీ, కింది స్థాయి అధికారులు టీడీపీ నేతలను పట్టించుకోవడం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం ఎస్పీని ఉదహరిస్తూ.. మిగతా పోలీసుల వైఖరిపై కూడా జేసీ ఫైరయ్యారు. టీడీపీ అధికారంలోకి వస్తే వారి సంగతి చెబుతామని సభా వేదికనుంచి హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు కొందరు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారని పేర్కొన్నారు.
రెండున్నరేళ్లలో ఎన్నికలట..
మరో రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయని జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తామని చెప్పారు. పోలీసులు ఐదేళ్లు మాత్రమే పదవీలో ఉండరని గుర్తుచేశారు. మినిమం పదేళ్ల సర్వీసు ఉంటుందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి వారు ఎక్కడ ఉన్నా వదిలే ప్రస్తకే లేదని హెచ్చరించారు.
పోలీసులపైనే కేసులట..
పోలీసులపైనే కేసులు పెడతామని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను వేధించిన వారిపై గంజాయి, సారా కేసులు పెడతామని హెచ్చరించారు. జగన్ గురించి చంద్రబాబుకు చాలా సార్లు చెప్పానని గుర్తుచేశారు. కానీ ఆయన వినిపించుకోలేదని జేసీ చెప్పారు. శాంతి శాంతి అంటూ చంద్రబాబు తమను ముంచాడని అధినేతను కూడా జేసీ వదల్లేదు. చంద్రబాబులో కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
రిటైర్ అయినా.. వదల బొమ్మాళీ..
151 స్థానాలతో పటిష్టంగా వైసీపీ ఉండగా.. రెండున్నరేళ్లలో ఎన్నికలు వస్తాయని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమను వేధించిన అధికారులను వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ సదరు అధికారులు పదవీ విరమణ చేసినా.. వదిలిపెట్టబోమని కామెంట్ చేశారు. తమ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయిస్తా అంటూ జేసీ హాట్ కామెంట్స్ చేశారు.