నాడు దుష్ప్రచారం..నేడు విస్తరణ: కియా మోటార్స్:భారీ పెట్టుబడులు:ఆ వార్తలు షాకిచ్చాయి:జగన్
అమరావతి: నవ్విన నాపచేనే పండుతుందని పెద్దలు చెబుతుంటారు. కియా మోటార్స్ విషయంలో ఈ మాట అక్షరాల వాస్తవ రూపాన్ని దాల్చింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలకు భయపడిన కియా మోటార్స్ సంస్థ యాజమాన్యం అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని తమ కార్ల తయారీ ప్లాంటును తమిళనాడుకు తరలిస్తోందంటూ ఇదివరకు పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు, ప్రత్యేక కథనాలు ప్రచురితం అయ్యాయి. అవన్నీ నిరాధారమైనవేనంటూ అప్పట్లో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కియా మోటార్స్ సంస్థ యాజమాన్యం పలుమార్లు స్పష్టం చేయాల్సి వచ్చింది.
Recommended Video

54 మిలియన్ డాలర్లతో విస్తరణ..
ఏ సంస్థ యాజమాన్యమైతే అధికార పార్టీ నేతల ఆగడాలకు భయపడుతోందంటూ వార్తలు వచ్చాయో.. అదే సంస్థ యాజమాన్యం.. రాష్ట్రంలో అదనపు పెట్టుబడులను పెట్టబోతోంది..అది కూడా భారీగా. అనంతపురం జిల్లాలోని తమ కార్ల తయారీ ప్లాంట్ను విస్తరించబోతున్నట్లు కియా మోటార్స్ ప్రకటించింది. దీనికోసం 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టబోతున్నట్లు వెల్లడించింది. కియా మోటార్స్ ఇండియా లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) కుక్యుమ్ షిమ్.. గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ విషయాన్ని ప్రకటించారు.

కరోనా లేకుంటే.. ఇప్పటికే..
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండి ఉంటే ఈ పాటికే తాము పెట్టబడులను పెట్టేవాళ్లమని కుక్యుమ్ షిమ్ వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి అమలు చేస్తోన్న లాక్డౌన్ పరిస్థితులు కుదురుకున్న వెంటనే తాము తమ కార్ల తయారీ యూనిట్ను విస్తరిస్తామని స్పష్టం చేశారు. దీనికోసం 54 మిలియన్ డాలర్లను వ్యయం చేయబోతున్నామని, క్రమంగా ఈ పెట్టుబడుల మొత్తాన్ని మరింత పెంచుతామని అన్నారు. తమ కార్యకలాపాలు సజావుగా కొనసాగడానికి అవసరమైన అనుమతులను మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోందని ఆయన ప్రశంసించారు.

చంద్రబాబు ప్రభుత్వం షాక్ ఇచ్చింది..
కియా మోటార్స్ కార్ల తయారీ ప్లాంట్ ఏపీ నుంచి తరలిపోతోందంటూ వచ్చిన వార్తలు తనకు షాక్కు గురి చేశాయని వైఎస్ జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పరంగా గానీ, పార్టీ పరంగా గానీ ఏవైనా లోటుపాట్లు చోటు చేసుకున్నాయా? అందుకే ఆ సంస్థ రాష్ట్రం నుంచి తరలి వెళ్తోందా? అనే విషయంపై తాను ఆరా తీశానని అన్నారు. అన్ని విషయాలను తాను తెలుసుకున్నానని, కియా మోటార్స్ సంస్థ యాజమాన్యంతో అప్పటికప్పుడు మాట్లాడానని చెప్పారు. తమకు అలాంటి ఆలోచన ఏదీ లేదంటూ కియా మోటార్స్ యాజమాన్యం స్పష్టం చేసిందని అన్నారు.

అబద్ధాలను వ్యాపింపజేయడంలో దిట్ట..
అబద్ధాలను వ్యాప్తి చేయడంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్నంత శక్తిసామర్థ్యాలు మరొకరికి లేవని జగన్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. పారిశ్రామికవేత్తలను భయాందోళనలకు గురి చేయడానికే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని మండిపడ్డారు. ఫలితంగా తమ వల్ల పరిశ్రమలు పారిపోతున్నాయనే అపనమ్మకాన్ని అబద్ధాన్ని ప్రజల మెదళ్లలో జొప్పించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు రావడానికి అనుకూలమైన వాతావరణం, పరిస్థితులు కల్పించామని, పారిశ్రామిక విధానాన్ని రూపొందించామని చెప్పారు. అందుకే ఈ ఏడాదిలోనే 39 భారీ, మధ్య తరహా పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటు అయ్యాయని, 34 వేల మందికి ఉపాధిని కల్పించాయని అన్నారు.












Click it and Unblock the Notifications