జేసీ సీరియస్ వార్నింగ్: సొంత పార్టీకే
JC Prabhakar Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో చెలరేగిన ఇసుక వివాదం చిలికి చిలికి గాలీవానగా మారుతున్నట్టే కనిపిస్తోంది.
రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా ఇసుకను దోపిడీ చేస్తోన్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమౌతోన్న విషయం తెలిసిందే. ట్రాక్టర్లు, లారీల డ్రైవర్లు, యజమానుల నుంచి కమీషన్లను దండుకుంటోన్నారంటూ ఆరోపణలు రోజురోజుకూ వెల్లువెత్తుతోన్నాయి. ఉచిత ఇసుక పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జనం మండిపడుతున్నారు.

ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెరమీదికి వచ్చారు. ఓ వీడియోను విడుదల చేశారు. ఇసుక విషయంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను ఒప్పుకోనేది లేదని తేల్చి చెప్పారు.
ఇసుక అక్రమ రవాణాపై ఆయన బహిరంగంగా స్పందించడం ఈ మూడు వారాల వ్యవధిలో ఇది రెండోసారి. ఇసుకను ఇష్టానుసారంగా తరలిస్తోన్నారని, అలాంటి వాళ్ల టిప్పర్లు, ట్రాక్టర్లు పట్టుకుని పోతే సంవత్సరం పాటు అవి బయటికి రావని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఇసుకను తరలించడానికి టిప్పర్లు, ట్రాక్టర్లను అద్దెకు ఇవ్వొద్దని, ఇస్తే నష్టపోతారనీ అన్నారు.
రాష్ట్రంలో ఇంకెక్కడైనా సరే అక్రమంగా ఇసుకను తరలించుకోవాలని, తన నియోజకవర్గంలో మాత్రం అలాంటి పనులు చేయొద్దని జేసీ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇసుక విషయంలో మాత్రం తాను ఎలాంటి జోక్యం చేసుకోలేనని జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. తన అనుచరులు, తనకోసం ప్రాణాలను ఇచ్చిన వాళ్లయినా సరే ఈ విషయంలో మాత్రం తనను వదిలేయాలని దండం పెట్టి విజ్ఞప్తి చేశారు. అలాగని తాను వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని, ఏదో ఒక రకంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
తాడిపత్రి నియోజకవర్గంలో 25 మంది ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, వాళ్లంతా తన అనచరులేనని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అయిదు సంవత్సరాల పాటు తనతో పాటు కష్టపడ్డారని, వారి సేవలను ఎప్పటికీ మరిచిపోలేనని, ఏదో ఒక రకంగా ఆదుకుంటాననీ చెప్పారు. అంతేగానీ ఇసుక అక్రమ రవాణాను తాను ప్రోత్సహించలేనని స్పష్టం చేశారు.
అంతగా అవసరమైతే తాను మున్సిపల్ ఛైర్మన్ హోదాలో మునిసిపాలిటీ నుంచే ఇసుకను తరలిస్తానని జేసీ హామీ ఇచ్చారు. ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించలేనని అన్నారు. ఇసుక అక్రమ రవాణా కోసం అద్దెకు ఇచ్చే టిప్పర్లు, లారీలు ఎక్కడవున్నా సరే వదిలిపెట్టబోనని, వాటినీ సీజ్ చేయించే స్థాయికి పరిస్థితిని తీసుకుని రావొద్దని కోరారు.












Click it and Unblock the Notifications