అడ్డాలో కాలు పెట్టనున్న గోరంట్ల మాధవ్ - టీడీపీ నేతలకు పోలీసుల చుక్కలు!!
అనంతపురం: రాష్ట్ర రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో తీవ్ర దుమారానికి కారణమైన అంశం- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్స్. దీనిపై చెలరేగిన వివాదాలు ఇప్పటికీ తగ్గట్లేదు. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిరోజూ స్పందిస్తూనే వస్తోన్నారు. ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగుతూనే ఉన్నారు. దీని కోసం గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ను కేంద్రబిందువుగా చేసుకున్నారు.

పార్టీకి దూరంగా..
ఈ వీడియోను మార్ఫింగ్ చేశారంటూ అనంతపురం జిల్లా పోలీసులు ప్రకటించినప్పటికీ.. టీడీపీ నాయకులు మాత్రం వెనుకంజ వేయట్లేదు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేది వారి డిమాండ్. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్స్ వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను కొంతకాలం దూరంగా పెట్టారు. ఆయన దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించారు.

ఎదురుదాడికి..
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్లిన వైఎస్ జగన్ను గోరంట్ల మాధవ్ కలుసుకోలేదు కూడా. అది వీడియో మార్ఫింగ్ అంటూ అనంతపురం జిల్లా పోలీసులు ప్రకటించిన తరువాతే వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం ఆయన పట్ల కొంత మెతక వైఖరిని ప్రదర్శిస్తోంది. తెలుగుదేశం నాయకులపై ఎదురుదాడికి దిగింది. మాజీ మంత్రి కొడాలి నాని, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సహా పలువురు నాయకులు టీడీపీపై కౌంటర్ అటాక్ చేశారు.

అనంతకు మాధవ్..
ఈ పరిణామాల మధ్య- గోరంట్ల మాధవ్ ఇవ్వాళ అనంతపురం జిల్లాకు రానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన సమయంలో ఈ న్యూడ్ వీడియో కాల్స్ వ్యవహారం తెరమీదికి వచ్చింది. దీనితో ఆయన అక్కడి నుంచే స్పందించారు. అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి విలేకరుల సమావేశం తరువాత గోరంట్ల మాధవ్ మరింత ఘాటుగా తెలుగుదేశం పార్టీ నేతలు, వారికి అనుకూలంగా ముద్రపడిన మీడియా పెద్దలపై రియాక్ట్ అయ్యారు.

స్వాగత కార్యక్రమాలు..
ఇప్పుడిక ఆయన తన సొంత జిల్లాకు రానున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి వస్తారు. బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హిందూపురానికి వెళ్తారు. మాధవ్ రాక కోసం ఆయన అభిమానులు, కురుబ సంఘం ప్రతినిధులు పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ-కర్ణాటక సరిహద్దులో ఉన్న కోడికొండ చెక్పోస్ట్ వద్ద నుంచి హిందూపురం వరకూ ర్యాలీ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

టీడీపీ నేతలకు నోటీసులు..
గోరంట్ల మాధవ్ రాక సందర్భంగా అటు అనంతపురం జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయన రాకను నిరసిస్తూ ప్రదర్శన నిర్వహించే అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ర్యాలీలు గానీ, ప్రదర్శనలకు గానీ అనుమతి లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచుతారనే ప్రచారం జిల్లాలో ఉంది. టీడీపీ ముఖ్య నాయకులు కాల్వ శ్రీనివాసులు, జేసీ దివాకర్ రెడ్డి, జేపీ ప్రభాకర్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి తదితరులకు సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చారు.












Click it and Unblock the Notifications