ఏపీలో కరోనా విజృంభణ: 1,200కుపై కొత్త కేసులు, ఆ 4 జిల్లాల్లో సెంచరీ దాటిన కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.
ఒక్క రోజు వ్యవధిలోనే వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,809 నమూనాలను పరీక్షించగా.. 1271 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1271 కరోనా కేసులు
తాజాగా నమోదైన 1271 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,03,260కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి గుంటూరు, అనంతరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 7,220కు చేరింది.

ఏపీలో 8వేలు దాటిన యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 464 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,87,898కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,142 యాక్టివ్ కేసులున్నాయి.

ఆ నాలుగు జిల్లాల్లో కరోనా కేసులు అత్యధికం
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,51,14,988 కరోనా నమూనాలను పరీక్షించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో కొత్తగా 285 కరోనా కేసులు, గుంటూరు జిల్లాలో కొత్తగా 279 కరోనా కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలోనే నాలుగు జిల్లాల్లో 150కిపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఏపీలో జిల్లాల వారీగా పెరిగిన కరోనా కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 61, చిత్తూరులో 285, తూర్పుగోదావరిలో 27, గుంటూరులో 279, కడపలో 63, కృష్ణాలో 161, కర్నూలులో 52, నెల్లూరులో 43, ప్రకాశంలో 63, శ్రీకాకుళంలో 21, విశాఖపట్నంలో 189, విజయనగరంలో 15, పశ్చిమగోదావరిలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, కరోనా వ్యాక్సిన్ మూడో దశలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం వ్యాక్సిన్ వేయించుకున్నారు. భారత్పేట ఆరోలైన్లో ఉన్న 140వ వార్డు సచివాలయంలో ఉదయం రిజిస్ట్రేషన్ చేయించుకుని టీకా తీసుకున్నారు. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 45ఏళ్లు దాటినవారికి కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు.












Click it and Unblock the Notifications