ఏపీలో కరోనా కల్లోలం, 2వేలకు చేరువలో కొత్త కేసులు, గుంటూరులో ట్రిపుల్ సెంచరీ, జిల్లాలవారీగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే 2వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,072 నమూనాలను పరీక్షించగా.. 1730 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 1730 కరోనా కేసులు
తాజాగా నమోదైన 1730 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,07,676కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 7,239కు చేరింది.
ఏపీలో 10వేలు దాటిన యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 842 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,90,137కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,300 యాక్టివ్ కేసులున్నాయి.
ఆ నాలుగు జిల్లాల్లో కరోనా కేసులు అత్యధికం
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,52,08,436 కరోనా నమూనాలను పరీక్షించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో కొత్తగా 378 కరోనా కేసులు, చిత్తూరు జిల్లాలో కొత్తగా 338 కరోనా కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలోనే నాలుగు జిల్లాల్లో 200కిపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఏపీలో జిల్లాల వారీగా పెరిగిన కరోనా కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 59, చిత్తూరులో 338, తూర్పుగోదావరిలో 27, గుంటూరులో 378, కడపలో 54, కృష్ణాలో 226, కర్నూలులో 54, నెల్లూరులో 164, ప్రకాశంలో 81, శ్రీకాకుళంలో 58, విశాఖపట్నంలో 235, విజయనగరంలో 46, పశ్చిమగోదావరిలో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది ఇలావుండగా, రాష్ట్రంలో మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.