ఏపీలో మళ్లీ 11వేలు దాటిన కరోనా కేసులు: శ్రీకాకుళంలో తొలిసారి అత్యధికం, 80వేలకు పైగా యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల ఉధృతి కొనసాగుతోంది.సెకండ్ వేవ్లో రెండో రోజు కూడా కొత్త కేసులు 11 వేలను దాటగడం ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 50,972 నమూనాలను పరీక్షించగా.. 11,698 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారంసాయంత్రం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 11,698 కరోనా కేసులు, 37 మరణాలు
తాజాగా నమోదైన 11,698 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,20,926కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 37 మంది మృతి చెందారు.తూర్పుగోదావరి, నెల్లూరులో ఆరుగురు చొప్పున, అనంతపురం, చిత్తూరులో నలుగురేసి చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ముగ్గురు చొప్పున, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. తాజా మరణాలతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7616కు చేరింది.
ఏపీలో 80వేలకుపైగా యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 4421 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 9,31,839కి చేరింది. కాగా, కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల్లో అత్యధిక పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 81,471 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,59,31,722 కరోనా నమూనాలను పరీక్షించారు.
చిత్తూరు, గుంటూరులో కరోనా కల్లోలం..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. శ్రీకాకుళంలో తొలిసారి అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఏకంగా 1641 కరోనా కేసులు శ్రీకాకుళంలో వెలుగుచూశాయి. అనంతపురం, చిత్తూరు, గుంటూరులో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరిలో కాస్త తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో జిల్లాల వారీగా భారీగా కొత్త కరోనా కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 1066, చిత్తూరులో 1306, తూర్పుగోదావరిలో 909, గుంటూరులో 1581, కడపలో 549, కృష్ణాలో 631, కర్నూలులో 820, నెల్లూరులో 902, ప్రకాశంలో 462, శ్రీకాకుళంలో 1641, విశాఖపట్నంలో 947, విజయనగరంలో 592, పశ్చిమగోదావరిలో 292 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు ఆంక్షలకు ఉపక్రమించింది. శనివారం నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సేవలు మినహా వేటికీ అనుమతి లేదు. కాగా, మాస్కులు ధరించకుంటే రూ. 100 జరిమానా విధించాలని ఏపీ సర్కారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏపిలో 18ఏళ్లు దాటిన వారందరికీ మే 1 నుంచి ఉచితంగానే వ్యాక్సిన్ వేయనున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది.