ఏపీలో 13 కరోనా కేసులు: రిపోర్టుల తర్వాతే క్లారిటీ, మాస్కుల ధరలకు రెక్కలు, భారీగా పెంచేశారు
అమరావతి: తెలుగు రాష్ట్రాలను కరోనావైరస్ వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు అత్యంత తక్కువ సంఖ్యలోనే నమోదైనప్పటికీ.. అనుమానిత కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో ఒక పాజిటివ్ కేసు నమోదవగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అనుమానితుల సంఖ్య ఎక్కువగా ఉంది.
13 కరోనా కేసుల రిపోర్టు కోసం వెయిటింగ్..
కరోనా కేసులను గుర్తించేందుకు ఏపీ సర్కారు ఇప్పటికే విమానాశ్రాయాల్లో స్క్రీనింగ్ ప్రారంభించింది. కరోనావైరస్ ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చిన 361 మంది ప్రయాణికులకు ఈ టెస్టులు నిర్వహించారు. 24 మంది నమూనాలను టెస్టులకు పంపించారు. వీరిలో 13 మంది ఆస్పత్రిలో చేరగా, మరో 11 మందికి కరోనా నెగిటివ్ అని తేలడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. 13 మంది టెస్టులకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. వారిలో అందరికీ నెగిటివ్ వస్తుందా? లేక కొందరికి పాజిటివ్ వస్తుందా? అనేది ఉత్కంఠగా మారింది.
ఆందోళన వద్దంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు..
అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనావైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి. మాస్కులు ధరించడం, సరైన శుభ్రతను పాటిస్తే చాలని స్పష్టం చేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారు మాత్రమే కరోనావైరస్ బారినపడే అవకాశం ఉందని.. అనుమానం ఉన్నవారు వెంటనే ఆస్పత్రిలో చేరి సరైన చికిత్స తీసుకుంటే నయమైపోతుందని పేర్కొంటున్నాయి.
మాస్కుల కృత్రిమ కొరత
కరోనావైరస్ భయాందోళనలను తెలుగు రాష్ట్రాల్లోని మెడికల్ షాపుల యాజమాన్యాలు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో మాస్కుల కొరతను కృత్రిమంగా సృస్టించి ధరలనుపెంచేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. మాస్కుల కొరత ఉంది.. ధరలు ఇంకా పెరిగిపోతాయంటూ సమాధానం చెబుతుండటం గమనార్హం.
Recommended Video
మాస్కుల ధరలకు రెక్కలు..
దేశంలోనూ ఇలాంటి పరిస్థితే కొనసాగుతోంది. సర్జికల్ మాస్కులను సాధారణంగా రూ. 10-12కు విక్రయించాల్సి ఉండగా.. ప్రస్తుతం వాటిని రూ. 50కి అమ్ముతుండటం గమనార్హం. అంతేగాక, ఎన్95 మాస్కుల ధరలు సాధారణంగా రూ. 200-250 ఉండగా.. ప్రస్తుతం వాటిని రూ. 500కు అమ్ముతున్నారు. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాస్కులను ఎక్కువ ధరలకు అమ్ముతున్న మెడికల్ షాపులు, ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాస్కులను ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశాయి