కరోనా అప్డేట్ : ఏపీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. మరో 57 మంది మృతి...
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది.గడిచిన 24 గంటల్లో 14,792 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 57 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 10,84,336కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7928కి చేరింది.
Recommended Video
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 86,035 కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకూ 1,63,03,866 కరోనా టెస్టులు నిర్వహించారు. మరో 8188 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ మొత్తం 9,62,250 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,14,158 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజాగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1831 కొత్త కేసులు,శ్రీకాకుళంలో 1829 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 1702, గుంటూరు జిల్లాలో 1760, విశాఖపట్నంలో 1129 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 596 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన మరణాల్లో అనంతపురం,విజయనగరం,పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏడుగురి చొప్పున,తూర్పు గోదావరిలో ఆరుగురు,చిత్తూరు,విశాఖపట్నంలో ఐదుగురు చొప్పున,శ్రీకాకుళంలో నలుగురు,కడప,కృష్ణా,ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున,కర్నూలులో ఇద్దరు,గుంటూరులో ఒకరు మృతి చెందారు.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి గురువారం(ఏప్రిల్ 29) మరో 3లక్షల వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ నుంచి కోవీషీల్డ్ వ్యాక్సిన్లను తీసుకొచ్చారు. అనంతరం రోడ్డు మార్గంలో తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి జిల్లాలకు తరలించనున్నారు. తాజాగా రాష్ట్రానికి చేరుకున్న టీకాలతో వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం లభించినట్లయింది.
రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఏ వేడుకకైనా 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పింది. క్రీడా ప్రాంగణాలు,జిమ్ సెంటర్లు,స్విమ్మింగ్ పూల్స్ను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించింది. అలాగే ప్రజా రవాణా,సినిమా హాళ్లు 50శాతం ఆక్యపెన్సీతోనే నిర్వహించాలని ఆదేశించింది.