ఏపీలో కొత్త కరోనా కేసుల కంటే కోలుకుంటున్నవారే ఎక్కువ: జిల్లాలవారీగా స్వల్పంగా తగ్గిన కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. అయితే, గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 60,124 నమూనాలను పరీక్షించగా.. 14,986 మందికి కరోనా సోకినట్లు తేలింది. కరోనా పరీక్షలు తగ్గించడంతో కేసులు కూడా తగ్గినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా లక్షకుపైగా పరీక్షలు చేయగా.. గత 24 గంటల్లో మాత్రం 60వేల నమూనాలను మాత్రమే పరీక్షించారు. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 14,986 కరోనా కేసులు, 84 మరణాలు
తాజాగా నమోదైన 14,986 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,02,589కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 84 మంది మృతి చెందారు. పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా 12 మంది చొప్పున మరణించారు. తూర్పుగోదావరి జిల్లాలో 10 మంది, విశాఖపట్నంలో 9 మంది, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో 8 మంది చొప్పున, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఆరుగురు చొప్పున, కృష్ణా, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున, అనంతపురంలో ముగ్గురు, కడపలో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 8791కి చేరింది.

ఏపీలో లక్షా90వేలకుపైగా యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 16,167 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 11,01,536కి చేరింది. చాలా రోజుల తర్వాత కొత్త కరోనా కేసుల కంటే.. కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుతం 1,89,367 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,74,28,059 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2352 కరోనా కేసులు నమోదు కాగా, అల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 423 మంది కరోనా బారినపడ్డారు.
Recommended Video

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 639, చిత్తూరులో 1543, తూర్పుగోదావరిలో 2352, గుంటూరులో 1575, కడపలో 1224, కృష్ణాలో 666, కర్నూలులో 948, నెల్లూరులో 1432, ప్రకాశంలో 639, శ్రీకాకుళంలో 1298, విశాఖపట్నంలో 1618, విజయనగరంలో 629, పశ్చిమగోదావరిలో 423 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కఠిన ఆంక్షలను విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు వారాలపాటు కర్ఫ్యూను అమలు చేస్తోంది.ఈ రెండు వారాలు కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలను అనుమతించనున్నారు. వాహనాల రాకపోకలు కూడా 12 గంటలవరకే అనుమతిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు 49 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.












Click it and Unblock the Notifications