టిడిపివైపు మంత్రులు, జగన్వైపు 15మంది ఎమ్మెల్యేలు
కిరణ్ పార్టీ వైఖరి తేల్చే వరకు లేదా 21వ తేదీ తర్వాత ఆ పార్టీల్లోకి వెళ్లాలని చాలామంది ఇప్పటికే నిర్ణయించుకున్నారట. మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి, కమలాపురం శాసన సభ్యులు వీరశివా రెడ్డిలు టిడిపిలోకి వెళ్లనున్నారట. మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు సైకిలెక్కుతారనే ప్రచారం ఎప్పటి నుండో సాగుతోంది. త్వరలో తన నిర్ణయాన్ని తెలియజేస్తానని ఏరాసు చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా తమ పార్టీలోకి పదిహేనుమంది వరకు ఎమ్మెల్యేలు వస్తారని భావిస్తున్నారట. సీమాంధ్రలో జగన్ పార్టీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలోకి వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారట. అయితే జగన్ టిక్కెట్ పైన హామీ పైనే ఇప్పుడు చిక్కులు వచ్చి పడ్డాయంటున్నారు.
కిరణ్ కొత్త పార్టీ స్థాపించకుంటే ఏ పార్టీలో తాము కోరుకున్న స్థానంలో ఖాళీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యేందుకు కూడా చాలామంది ఉన్నారు. గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు కాంగ్రెసు పార్టీని వీడి టిడిపిలో చేరి మరోసారి పోటీ చేయాలని తొలుత భావించారు. కానీ టిడిపి గుంటూరు లోకసభ స్థానానికి గల్లా జయదేవ్ పేరును నిర్ణయించింది. దీంతో రాయపాటి వెనక్కి తగ్గి ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. రాయపాటి లాంటి వారు కిరణ్ కొత్త పార్టీ కోసం చూస్తున్నారు.