కరోనా అప్డేట్ : ఏపీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు... మరో 82 మంది మృతి
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది.గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 20,034 పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 82 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 11,84,028కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 8289కి చేరింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,15,784 కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకూ 1,68,33,932 కరోనా టెస్టులు నిర్వహించారు. మరో 12,207 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ మొత్తం10,16,142 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,59,597 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజాగా నమోదైన కేసుల్లో శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 2398, అత్యల్పంగా కడప జిల్లాలో 793 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన మరణాల్లో అనంతపురం,విజయనగరం,విశాఖపట్నం,తూర్పు గోదావరి జిల్లాల్లో 9 మంది చొప్పున,నెల్లూరులో 7 మంది,కృష్ణా జిల్లాలో 6 మంది,గుంటూరులో 5 మంది,చిత్తూరు,కర్నూలు,ప్రకాశం,శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు.
రాష్ట్రంలో వైరస్ బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా మరో 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.346 కోట్లు కేటాయించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,850 ఆక్సిజన్ సపోర్ట్తో కూడిన పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రెమ్డిసివిర్ ఇంజెక్షన్లకు కూడా కొరత లేదన్నారు.
రెండు రోజుల క్రితం ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం ధరలు ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. NABH(National Accreditation Board for Hospitals) అక్రిడేషన్ కలిగిన ఆసుపత్రుల్లో నాన్ క్రిటికల్ కేర్(ఆక్సిజన్ లేకుండా) చికిత్స కోసం రోజుకు రూ. 4000, అక్రిడేషన్ లేని ఆసుపత్రుల్లో రూ.3600 వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆక్సిజన్ సపోర్ట్తో కూడిన కరోనా ట్రీట్మెంట్కు అక్రిడేషన్ కలిగిన ఆస్పత్రుల్లో రోజుకు రూ.6,600, అక్రిడేషన్ లేని ఆస్పత్రుల్లో రోజుకు రూ.5,850 వసూలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అక్రిడేషన్ కలిగిన ఆస్పత్రులకు ఐసీయూలో చికిత్స అందిస్తే రోజుకు రూ.12 వేలు, అక్రిడేషన్ లేని ఆస్పత్రుల్లో రూ.10,800 ఫీజుగా వసూలు చేయాలని తెలిపింది.
క్రిటికల్ కేర్ చికిత్స (ఐసీయూ+వెంటిలేటర్) కోసం అక్రిడేషన్ కలిగిన ఆస్పత్రుల్లో రూ.16 వేలు, అక్రిడేషన్ లేని ఆస్పత్రుల్లో రూ.14,400 వసూలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు భారీగా దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఇలా ధరలు ఫిక్స్ చేసింది.