అప్పటి తప్పులేమిటి: లేకుంటే జగన్ దుకాణం మూసేసుకోవాల్సిందే...
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించకపోతే జగన్ దాదాపుగా దుకాణం మూసేసుకోవాల్సిన పరిస్థితే. అలాంటి స్థితిలో ఆయన గతంలో చేసిన తప్పులను చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
హైదరాబాద్: గత ఎన్నికల్లో విజయం తమదేనంటూ అతి విశ్వాసంతో ముందుకు సాగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఫలితాలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. కొద్దిశాతం ఓట్ల తేడాతో జగన్ అధికారానికి దూరం కావాల్సి వచ్చింది.
గతంలో చేసిన తప్పులను వచ్చే ఎన్నికల్లో చేయబోనని వైయస్ జగన్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. గతంలో ఆయన చేసిన తప్పులేమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధింంచకపోతే జగన్ చాప చుట్టేయాల్సిన పరిస్థితి రావచ్చు.
అందుకే, జగన్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. ప్రశాంత్ కిశోర్ను ఎన్నికల వ్యూహకర్తగా ఎంచుకున్నారు. సర్వశక్తులూ ఒడ్డడానికి ఆయన సిద్దమైనట్లు కనిపిస్తున్నారు. గతంలో ఆయన చేసిన తప్పులేమిటనే చర్చకు కారణాలను ఇలా చెప్పుకునే అవకాశం ఉంది.

వైయస్ ఇమేజ్....
తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డికి ప్రజల్లో ఉన్న పలుకుబడి తనను గెలిపించి తీరుతుందని వైయస్ జగన్ గత ఎన్నికల్లో గట్టిగా నమ్మారు. వైయస్ అమలు చేసిన ప్రజా సంక్షేమ ఫథకాలను ఆయన ప్రచారానికి ఎక్కువగా వాడుకున్నారు. అయితే, ప్రజలు దాన్ని ఏ మేరకు తీసుకున్నారనేది తేలేది కాదు. అయితే, గత కొన్నాళ్లుగా ఆయన దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి అంటూ చేస్తున్న ప్రసంగాలకు స్వస్తి చెప్పినట్లు కనిపిస్తున్నారు.

ఏకపక్షంగా నిర్ణయాలు....
సీతయ్య ఎవరి మాటా వినరు అనే పద్ధతిలో జగన్ వ్యవహరిస్తారనే అభిప్రాయం బలంగా ఉంది. ఆయన సన్నిహితులు కూడా అదే మాట చెబుతారు. దీంతో చెప్పడం వృధా అనుకోవడం వల్ల కూడా కొంత మంది సలహాలు ఇవ్వడానికి వెనకాడినట్లు చెబుతారు. దీంతో తన వ్యూహంలోని తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ఆయనకు అవకాశం చిక్కలేదని అంటున్నారు. దానికి జగన్ ప్రస్తుతం స్వస్తి చెప్పే అవకాశాలున్నట్లు సమాచారం.

తెలంగాణకు వ్యతిరేకంగా...
రాష్ట్ర విభజన ఖాయం కాగానే జగన్ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్ర విభజన అనేది తమ పరిధిలో లేదని చెబుకుంటూ వచ్చిన ఆయన అకస్మాత్తుగా ఆ నిర్ణయం తీసుకోవడం ఆయనకు కలిసి వచ్చిందో లేదో చెప్పడం కష్టమే గానీ దాన్నే ఎక్కువగా వాడుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించగలననే నమ్మకాన్ని జగన్ ప్రజలకు కల్పించలేకపోయారు.

బిజెపితో నెయ్యానికి నో....
జగన్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి అప్పట్లో బిజెపి ముందుకు వచ్చినట్లు చెబుతారు. అయితే, ఆ ప్రతిపాదనను జగన్ కొట్టిపారేశారు. ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామని అతి విశ్వాసం కారణంగా ఆయన బిజెపిని కాదన్నారని చెప్పవచ్చు. అది పెద్ద పొరపాటే అయింది.

మరో వైపు ఇలా....
ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని బిజెపిని ముందుకు తెచ్చిన అంశాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అందిపుచ్చుకున్నారు. బిజెపితో పొత్తుకు సిద్ధపడ్డారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి అయ్యే చంద్రబాబు ప్రజలకు విభజన సమస్యలను ఎలా పరిష్కరిస్తామనే విషయాన్ని ప్రచార సభల్లో వివరిస్తూ వెళ్లారు. దానివల్ల ప్రజలకు టిడిపి, బిజెపి కూటమిపై పూర్తి విశ్వాసం కలిగింది. ఆ కూటమి వ్యూహానికి ప్రతివ్యూహాన్ని రూపొందించి అమలు చేయడంలో జగన్ విఫలమయ్యారనే చెప్పాలి. ఆ కూటమిని ఎదుర్కోవడానికి జగన్ ఏ విధమైన ప్రయత్నమూ చేయలేదు.

పవన్ కల్యాణ్ జత కలవడంతో...
నిజానికి, గత ఎన్నికల్లో జగన్ను అధికారానికి దూరం చేసింది పూర్తిగా పవన్ కల్యాణ్ అని చెప్పవచ్చు. కాంగ్రెసుకు, మరీ ముఖ్యంగా వైయస్ రాజశేఖర రెడ్డికి అనుకూలంగా ఉండే ఓ సామాజిక వర్గం గత ఎన్నికల్లో జగన్కు దూరమైంది. ఈ విషయాన్ని ఆయన పసిగట్టినట్లు లేరు. కోస్తాంధ్రలో ఇది తీవ్రంగా జగన్ను దెబ్బ తీసింది. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తన పార్టీని ఎన్నికల బరిలోకి దించుతున్నారు. పైగా, వామపక్షాలు ఆ పార్టీతో జత కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాన్ని జగన్ ఎలా ఎదుర్కుంటానేది ప్రస్తుతానికి స్పష్టత లేదు.

సానుభూతిపై ఎక్కువగా....
వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో ప్రజల్లో సానుభూతి పవనాలు వీస్తున్నాయని, అది గట్టెక్కిస్తుందని కూడా జగన్ గత ఎన్నికల్లో గట్టిగా నమ్మినట్లు చెప్పవచ్చు. ఆ సానుభూతిని ఓట్లుగా మార్చుకునేందుకు ఆయన తన తల్లి విజయమ్మను, సోదరి షర్మిలను రంగంలోకి దింపారు. అయితే, అది పెద్దగా పనిచేసినట్లు లేదు. పైగా విజయమ్మ విశాఖపట్నం పార్లమెంటు సీటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పెద్దలు చెప్పినా వినకుండా ఆమెను అక్కడి నుంచి జగన్ పోటీకి దింపినట్లు చెబుతారు.

ఈ విషయంలోనూ....
ప్రాంతాలవారీగా, నియోజకవర్గాల వారీగా సామాజిక సమీకరణాలను అంచనా వేసి, విశ్లేషించి తగిన అభ్యర్థిని ఖరారు చేయడంలో కూడా గత ఎన్నికల్లో జగన్ విఫలమయ్యారని చెప్పవచ్చు. తాను ఎవరిని పోటీకి దించినా గెలిచి వస్తారనే అతి విశ్వాసం వల్ల ఆయన అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోలేదని అంటారు. దానికితోడు, ఏళ్ల తరబడి అనుభవం ఉన్న రాజకీయ నాయకులను టిడిపి పోటీకి దించింది. వారి బలాలను కూడా జగన్ లెక్కలోకి తీసుకోలేదని అంటారు.

జగన్కు ఇలా దూరమయ్యారు...
తనను నమ్మి వచ్చిన సీనియర్ రాజకీయ నేతలను వైయస్ జగన్ క్రమంగా దూరం చేసుకున్నారు. సబ్బం హరి, మైసురారెడ్డి వంటి సీనియర్లను ఆయన దూరం చేసుకున్నారు. జగన్ తమ సలహాలు వినకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని జ్యోతుల నెహ్రూ వంటి సీనియర్లు పార్టీ మారిన సమయంలో చేసిన వ్యాఖ్యలను ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఉంది.

వారంతా వస్తామన్నారట....
రాయపాటి సాంబశివ రావు, కావూరి సాంబశివ రావు, జేసి బ్రదర్స్ వంటి సీనియర్లు పార్టీలోకి వస్తామంటే జగన్ తిప్పికొట్టినట్లు చెబుతారు. జగన్ జెసి బ్రదర్స్ను తీసుకుని ఉంటే అనంతపురం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నష్టపోయి ఉండేది కాదని అంటారు. రాయపాటి, కావూరి సాంబశివరావులను తీసుకుని ఉంటే చంద్రబాబుకు బలాన్ని సమకూర్చిన ఓ సామాజిక వర్గం ఓట్లను వైసిపి చీల్చి లాభపడి ఉండేది.

షర్మిళకు అన్యాయం చేశారని....
గత ఎన్నికల్లో విజయమ్మను విశాఖ పార్లమెంటు సీటు నుంచి పోటీకి దించడం ఎంత పొరపాటో, షర్మిలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం అంతే పొరపాటు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. షర్మిళను కావాలనే జగన్ పక్కన పెడుతున్నారనే అభిప్రాయం అప్పట్లో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లింది. పార్టీలో రెండో పవర్ సెంటర్ తయారవుతుందనే భయంతోనే షర్మిళను దూరం పెట్టినట్లు ప్రచారం సాగింది.












Click it and Unblock the Notifications