సాయిరెడ్డి..సజ్జల సహా సమన్వయకర్తల ఔట్..!! సీఎం భారీ స్కెచ్ : 2024 యాక్షన్ ప్లాన్ రెడీ-వారికి ఛాన్స్..!!
ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ స్థానాల భర్తీ పైన ఫోకస్ పెట్టారు. ఈ స్థానాల భర్తీ... పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవుతూనే.. ఈ నె 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ తరువాత కేబినెట్ విస్తరణ దిశగా సీఎం అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక, ఈ సారి తీసుకొనే ప్రతీ నిర్ణయం వచ్చే ఎన్నికలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఎటువంటి మోహమాటాలకు తావు లేకుండా పార్టీ- ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో ప్రక్షాళనకు సీఎం సిద్దం అవుతున్నారు.
పార్టీ - ప్రభుత్వంలో భారీ ప్రక్షాళన..
రెండున్నారేళ్ల కాలంలో కరోనా కారణంగా ప్రజల్లోకి వెళ్లలేకపోయిన సీఎం..ఇక, ప్రజల్లోనే సాధ్యమైనంత సమయం ఉండాలని భావిస్తున్నారు. అదే సమయంలో కేబినెట్ విస్తరణలో సైతం పూర్తిగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలతో సహా పార్టీ నేతలు సీఎం ను కలిసే అవకాశం ఇవ్వటం లేదనే అభిప్రాయం ఉంది. అదే విధంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఎక్కడా డెవలప్ మెంట్ లేదా రాజకీయ కార్యక్రమాల గురించి నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేదంటూ సొంత పార్టీ నేతల నుంచే అసహనం వ్యక్తం అవుతోంది.
సమన్వయకర్తలకు కొత్త బాధ్యతలు
ఏదీ కావాలన్నా...సమన్వయకర్తల ద్వారానే ముందుకు వెళ్లాల్సి ఉండటం కొంత మంది సీనియర్లు అసౌకర్యంగా ఫీలవుతున్నారు. నలుగురైదుగురు నేతలు జగన్ సొంత మనుషులుగా... ప్రభుత్వంలో - పార్టీలో పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. దీంతో..జగన్ ఈ మొత్తం పరిస్థితులను మార్చేందుకు సిద్దం అయ్యారు. అందులో భాగంగా జిల్లాల సమన్వయకర్తలను తొలిగించాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
కీలక నేతలకు సైతం మినహాయింపు లేనట్లే
ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ గా విజయ సాయిరెడ్డి.. అదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి.. వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి..వైవీ సుబ్బారెడ్డి..అయోధ్య రామిరెడ్డి ఇతర జిల్లాలకు సమన్వయ కర్తలుగా ఉన్నారు. వీరికి జిల్లాల బాధ్యతల నుంచి తొలిగించి.. ప్రభుత్వ - పార్టీ నిర్ణయాల అమలు బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో..పాటుగా ప్రస్తుతం ఉన్న కేబినెట్ లోని మంత్రులకు పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. రాజకీయంగా ఏ అంశాన్ని అయినా డీల్ చేయగలిగే సమర్ధులుగా గుర్తింపు ఉన్న వారిని ఎంపిక చేసి వారికి వైసీపీ పొలిటికల్ యాక్షన్ టీం ను ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు.
పొలిటికల్ యాక్షన్ టీం ఏర్పాటు దిశగా
వారు జిల్లా బాధ్యలతో టచ్ లో ఉంటూ ప్రతీ జిల్లా .. అదే విధంగా ప్రతీ నియోజకవర్గం నుంచి క్షేత్ర స్థాయి సమాచారం సేకరిస్తారు. ఇదే సమయంలో పార్టీ - ప్రభుత్వం మధ్య సమన్వయ కమిటీని సైతం ఏర్పాటు చేయనున్నారు. ఎమ్మెల్యేలు..పార్టీ నేతలు ప్రభుత్వంలో పని కావాలన్నా..ఆ కమిటీ బాధ్యత తీసుకుంటుంది. ఇక, ప్రశాంత్ కిషోర్ టీం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ నియోజకవర్గాల వారీగా పార్టీ పరమైన అంశాలు...ఎమ్మెల్యేల పనితీరు... వారి పైన ప్రజాభిప్రాయం..స్థానిక అంశాలు.. పధకాల నిర్వహణ పైన పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి..వైసీపీ కీలక టీంకు అందించనుంది.
ఎమ్మెల్యేలు.. పార్టీ కేడర్ కు ప్రాధాన్యత
ఆ నివేదికలకు అనుగుణంగా.. తీసుకోవాల్సిన చర్యల పైన ఆ కమిటీ ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వనుంది. ఇక, సీఎం సైతం ప్రతీ శని - ఆదివారాల్లో జిల్లాల పర్యటనలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. విజయసాయిరెడ్డి - సజ్జల- వైవీ సుబ్బారెడ్డి - వేమిరెడ్డి ని పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాల బాధ్యత వీరికి కేటాయించనున్నారు. చంద్రబాబు హాయంలో ఆయన కోటరీ సభ్యులుగా కొంత మంది నేతలు వ్యవహరించే వారు.
ప్రభుత్వంలోనూ కీలక మార్పులకు సిద్దం
ఇప్పుడు తన హయాంలో అలాంటి కోటరీలు..అటువంటి అభిప్రాయాలకు అవకాశం ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రతీ అడుగు చర్చకు కారణమయ్యే పరిస్థితులు ఉండటంతో...అన్నింటా అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇక, కొత్త కేబినెట్ లోకి వచ్చే వారి విషయంలో నూ సీఎం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. సామాజిక - ప్రాంతీయ సమీకరణాలను పక్కగా అమలు చేస్తూ అదే సమయంలో ప్రభుత్వ- పార్టీ పరంగా ప్రభావితం చేయగలిగిన వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది.
జగన్ ఆలోచనలతో నేతల్లో ఉత్కంఠ
అదే సమయంలో అసలు ఇప్పటి వరకు మంత్రి పదవులు దక్కని అరుదైన సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా కసరత్తు సాగుతున్నట్లు సమాచారం. దీంతో.. డిసెంబర్ మాసాంతానికి పూర్తిగా ప్రభుత్వంలో.. పార్టీ పరంగా ప్రక్షాళన చేసి వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సంసిద్దులు కావాలని సీఎం భావిస్తున్నారు. దీంతో..ఇప్పుడు సీఎం జగన్ తీసుకొనే నిర్ణయాల్లో ఎవరికి ఏ పదవులు వరిస్తాయో.. ఎవరికి ఎటువంటి బాధ్యతలు దక్కుతాయో అనే ఉత్కంఠ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.