2024కి జగన్ రూట్ క్లియర్ అవుతోందా - గురి తప్పిన చంద్రబాబు "అస్త్రం"..!!
ఏపీలో 2024లో గెలిచేదెవరు. ఇప్పటికే ఆ ఎన్నికల దిశగా రాజకీయం మొదలైంది. సీఎం జగన్ - టీడీపీ అధినేత చంద్రబాబు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎవరి లెక్కలతో వారు ధీమాగా ఉన్నారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన తరువాత ఏపీ రాజకీయాల్లో ఒక్క సారిగా మార్పు కనిపిస్తోంది. జగన్ ను ఓడించాలంటే మరోసారి బీజేపీ -జనసేన తో పొత్తు దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. బీజేపీతో సంధి సాధ్యపడే అవకాశాలు కనిపించటం లేదు. పవన్ చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్నారు. జనసేనానితో పొత్తు పై ఇంకా డైలమా కొనసాగుతోంది. రెండు పార్టీలే కలిస్తేనే హోరా హోరా..లేకుంటే జగన్ కు 2024 అనుకూలంగా ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

పవన్ తాజా వ్యాఖ్యలతో కొత్త సమీకరణలు...
పవన్ కల్యాణ్ తాజాగా పార్టీ కార్యాలయంలో చేసిన వ్యాఖ్యలతో ఏపీలో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. పవన్ తన ప్రసంగాల్లో తొలి సారిగా 2024 తో పాటుగా 2029 ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తున్నారు. 2024, 2029 ఎన్నికలు కీలకమని చెబుతున్నారు. 2024లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని అంటూనే..2029 గురించి ప్రస్తావించటంపై అనేక విశ్లేషణలు మొదలయ్యాయి. బీజేపీ నేతల నినాదం కూడా 2029 లో బీజేపీ - జనసేన అధికారంలోకి రావటమని ఆ పార్టీ నేతలే పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇదే సమయంలో జనసేన మొత్తం 175 సీట్లకు పోటీ చేసేందుకు పిద్దం అవుతోందనే వాదన పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. వైసీపీని ఓడించేందకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని గతంలో పలు మార్లు చెప్పిన పవన్..ఇప్పుడు ఆ విషయం ప్రస్తావించటం లేదు. అందరినీ ఏకం చేస్తానన్న పవన్.. ఇప్పుడు తనను గెలిపించండంటూ కోరుతున్నారు. ఇదే, ఇప్పుడు టీడీపీలో ఆసక్తికర చర్చగా మారింది.

2029 గురించి పవన్ ప్రస్తావన వెనుక..
2024 ఎన్నికలు అటు వైసీపీకి ఇటు టీడీపీకి ప్రతిష్ఠాత్మకం. రెండు పార్టీల భవిష్యత్ కు ఈ ఎన్నికలు ప్రధానమైనవిగా భావిస్తున్నాయి. తాజాగా చంద్రబాబు సైతం ఈ ఎన్నికల్లో గెలిస్తే సరి, లేకుంటే ఇవే చివరి ఎన్నికలని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే విజయవాడలో పవన్ బస చేసిన హోటల్ కు వెళ్లి మరీ..చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు. భవిష్యత్ పరస్పర ప్రయోజనాల కోసం కలవాలనే ప్రతిపాదన పైన దాదాపుగా అంగీకారినికి వచ్చారు. బీజేపీ - పవన్ తో కలిసి 2014 తరహాలో పొత్తుల రిపీట్ కు అడుగులు వేసారు. ఆ దిశగా క్షేత్ర స్థాయిలోనూ రెండు పార్టీల శ్రేణులు సిద్దమయ్యాయి. కానీ, పవన్ తనకు నమ్మాలని..ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో..టీడీపీకి పవన్ ఆలోచనలో వచ్చిన మార్పు గుర్తించారు. కానీ, వేచి చూసే ధోరణితోనే ఉండాలని భావిస్తోంది. జగన్ ఎలా గెలుస్తారో చూస్తానంటూ పవన్ చెబుతున్న మాటలతో..పొత్తు అంశం తేలిపోలేదనే అభిప్రాయం కొందరు టీడీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో పవన్ 2029 ప్రస్తావన టీడీప నేతలకు అంతు చిక్కటం లేదు.

2024లో జగన్ కు లైన్ క్లియర్ అంటూ...
టీడీపీ - జనసేన కలిసొస్తే బీజేపీ కూటమిగా జగన్ పైన పోరాటం ఖాయమని అందరూ భావించారు. అదే జరిగితే 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయనే అంచనాలు వినిపించాయి. కానీ, ఇప్పుడు సీన్ మారుతోంది. టీడీపీని అధికారంలోకి తీసుకొస్తే భవిష్యత్ లో తాము రాజకీయంగా నష్టపోతామని బీజేపీ - జనసేన భావిస్తున్నాయి. ఇదే అంశం ఆ పార్టీల అంతర్గత సమావేశాల్లోనూ వ్యక్తమైంది. 2024లో జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ - జనసేన విడివిగా పోటీ చేస్తే పవన్ చెబుతున్నట్లుగా వైసీపీని అడ్డుకోవటం ఎలా సాధ్యమనే ప్రశ్న వినిపిస్తోంది. కానీ, పవన్ తాను సొంతంగా ఎదిగేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు చంద్రబాబు కీలకమై 2024 ఎన్నికల్లో ఒంటరి పోరు తప్పదా అనే చర్చ మొదలైంది. ఈ పరిణామాలు వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో, రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరింత ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications