యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ పంపిణీ.. సీఎం రేవంత్ కీలక హామీలు
పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదని.. ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి ప్రభుత్వ, గురుకుల విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యా శాఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడుతున్నారని.. పదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసంతో వందేళ్ల నష్టం జరిగిందని అన్నారు. అందుకే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు విద్య అందించాలని విద్యా శాఖను నా దగ్గరే పెట్టుకున్నానని స్పష్టం చేశారు.
"అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది యువత ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని మేం సంపూర్ణంగా విశ్వసించాం. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించాం. అందుకే బడ్జెట్ లో విద్య కోసం 8.5 శాతం నిధులు కేటాయించాం. విద్యాభివృద్ధికి రూ. 26,600 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇది ఖర్చుగా కాదు.. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా మేం భావిస్తాం" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
"పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదు. మేం అధికారంలోకి రాగానే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచాం. ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారు. విద్యా శాఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడుతున్నారు. పదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసంతో వందేళ్ల నష్టం జరిగింది. అందుకే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు విద్య అందించాలని విద్యా శాఖను నా దగ్గరే పెట్టుకున్నా" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
"ప్రీ ప్రైమరీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలపబోతున్నాం. రాబోయే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
"AI తుఫాన్ తో కోట్లాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అందుకే బ్లూ కాలర్ జాబ్స్ వైపు దృష్టి సారించాం. యువతకు నైపుణ్య శిక్షణ అందించే కార్యక్రమాన్ని చేపట్టాం ఇంగ్లీష్ తో పాటు జర్మనీ, జపాన్ భాషను నేర్పిస్తున్నాం. ఐటీఐలను ఏటీసీలుగా మార్చాం.. స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి పదును పెట్టి గొప్ప వాళ్లుగా తీర్చిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది" అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

"సోషల్ వెల్ఫేర్ లో చదువుకున్న విద్యార్థులు డాక్టర్లుగా, ఐఏఎస్ లుగా, ఐపీఎస్ లుగా, రాజకీయ నాయకులుగా ఎదగాలి. మీరంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. దేశాన్ని నడిపించే శక్తిగా ఎదగాలి. రేపటి భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది. మీ తలరాతను మార్చేది చదువొక్కటే. మీరు చదవండి.. మీకు ఏం కావాలో ఇచ్చే బాధ్యత మీ రేవంతన్న తీసుకుంటాడు. 27.50 లక్షల మంది విద్యార్థులకు ఇవాళ యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ అందిస్తున్నాం. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా, స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే పాఠశాలలు, కళాశాలలను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలనే సమున్నత లక్ష్యంతో గవర్నర్ శివప్రతాప్ శుక్లా.. 15 వేల మంది విద్యార్థులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు.












Click it and Unblock the Notifications