ఏపీలో వరుసగా రెండోరోజూ 20వేలకుపైగా కరోనా కేసులు: 85 మంది మృతి, 10లక్షల మందికిపైగా రికవరీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా ఒక్క రోజు వ్యవధిలో 20వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,16,367 నమూనాలను పరీక్షించగా.. 22,204 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 22,204 కరోనా కేసులు, 85 మరణాలు
తాజాగా నమోదైన 22,204 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,06,232కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 85 మంది మృతి చెందారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 11 మంది చొప్పున ప్రాణాలు కోల్పోగా, అనంతపురంలో 10 మంది, తూర్పుగోదావరిలో 9 మంది, ప్రకాశంలో 8, పశ్చిమగోదావరిలో 7, చిత్తూరులో 6, గుంటూరులో 5, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కృష్ణాలో నలుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కడపలో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 8374కు చేరింది.
ఏపీలో లక్షా70వేలకుపైగా యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 11,128 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 10,24,375కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల్లో అత్యధిక పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,70,588 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,69,50,299 కరోనా నమూనాలను పరీక్షించారు.
Recommended Video
ఏపీలో జిల్లాల వారీగా భారీగా కొత్త కరోనా కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 2304, చిత్తూరులో 1756, తూర్పుగోదావరిలో 2344, గుంటూరులో 1972, కడపలో 903, కృష్ణాలో 1138, కర్నూలులో 1985, నెల్లూరులో 1200, ప్రకాశంలో 2001, శ్రీకాకుళంలో 1982, విశాఖపట్నంలో 2113, విజయనగరంలో 1202, పశ్చిమగోదావరిలో 1304 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కఠిన ఆంక్షలను విధించింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వారాలపాటు కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు వారాలు కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలను అనుమతించనున్నారు. ఇక ఆర్టీసీ బస్సులు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకే సేవలందించనున్నాయి. ఆ తర్వాత ప్రజా రవాణాతోపాటు ప్రైవేటు వాహనాల సేవలు కూడా బంద్ కానున్నాయి. మే 5 నుంచి 12 గంటల తర్వాత రాష్ట్ర సరిహద్దులు కూడా మూసివేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.