ఉత్తరాంధ్రలో ఆటో ప్రమాదాలు:10 మంది విద్యార్థులతో సహా 22 మందికి గాయాలు
విశాఖపట్నం: విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలో జరిగిన రెండు వేర్వేరు ఆటో ప్రమాదాల్లో మొత్తం 20 మందికి పైగా గాయపడ్డారు. విశాఖ జిల్లా నక్కపల్లిలో శుక్రవారం ఉదయం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు.
ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన 11 మంది మత్స్యకార మహిళలు నక్కపల్లిలో జరిగే వారపు సంతకు తెల్లవారుజామున ఆటోలో బయలుదేరారారు. ఈ వాహనం నక్కపల్లి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకోగానే డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ముందు నెమ్మదిగా వెళుతున్న లారీని ఢీకొంది.

ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా 12 మందికి గాయాలయ్యాయి. వీరందరినీ సమీపంలోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సింహాచలం వెల్లడించారు.
మరోవైపు శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం శ్యామ్ పురం చెరువు గట్టు వద్ద శుక్రవారం ఉదయమే స్కూల్ ఆటో బోల్తా పడిన ఘటనలో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని రాజాం కేర్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆటోలో నారాయణ, చైతన్య విద్యానికేతన్ స్కూళ్లకు చెందిన 20 మంది విద్యార్థినీ విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ విద్యార్థినీ విద్యార్థులంతా శ్యామ్ పురం, లక్ష్మిపురం గ్రామానికి చెందిన వారని, బైక్ను తప్పించబోయి ఆటో బోల్తా పడిందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications