ఏపీలో కరోనా: చిత్తూరులో అత్యధిక కేసులు, కర్నూలులో అత్యల్పం, పెరుగుతున్న రికవరీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతోంది. భారీ సంఖ్యలో కరోనా పరీక్షలు చేసినప్పటికీ కొత్త కేసులు మాత్రం ఎక్కువగా నమోదు కావడం లేదు. మరణాల సంఖ్య కూడా భారీ తగ్గుతోంది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది.

ఏపీలో కొత్తగా 2618 కరోనా కేసులు, 16 మరణాలు
గత 24 గంటల్లో 88,780 కరోనా పరీక్షలు నిర్వహించగా 2618 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,25,966కు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనా బారినపడిన 16 మంది మరణించారు. ఈ మేరకు వివరాలను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది.

జిల్లాలవారీగా మరణాలు..
జిల్లాల వారీగా కరోనా మరణాలను గమనించినట్లయితే.. కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6706కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 81,17,685 కరోనా పరీక్షలను నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కేసులు
ఏపీ జిల్లాల వారీగా కొత్త కేసులను గమనిస్తే.. అనంతపురంలో 74, చిత్తూరులో 275, తూర్పుగోదావరిలో 91, గుంటూరులో 214, కడపలో 52, కృష్ణాలో 146, కర్నూలులో 21, నెల్లూరులో 58, ప్రకాశంలో 191, శ్రీకాకుళంలో 72, విశాఖపట్నంలో 32, విజయనగరంలో 37, పశ్చిమగోదావరిలో 103 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో పెరుగుతున్న రికవరీ
గత 24 గంటల్లో 3509 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 7,92,697 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,668 యాక్టివ్ కేసులున్నాయి. దీన్ని బట్టి చూస్తే కరోనా బారి నుంచి త్వరలోనే ఏపీ బయటపడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రజలు తీసుకునే జాగ్రత్తలు, ప్రభుత్వం చేపట్టే చర్యలపై ఇది ఆధారపడి ఉంది. ఇక దేశంలో 81లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా, లక్షా 22 మందికిపైగా మరణించారు. ప్రస్తుతం దేశంలో 5,71,119 యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications