ఐసిస్లో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ముగ్గురు: ఒకతను మృతి
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ఐఎస్ఐఎస్లో పనిచేస్తున్నట్లు నిఘా సంస్థలు పసిగట్టాయి. వారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలోని ఎన్నారై కుటుంబాలకు చెందినవారని నిఘా సంస్థలు గుర్తించాయి. వారు 2015లో ఐసిస్లో చేరినట్లు భావిస్తున్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాదులకు సమాచారం అందించడానికి ప్రయత్నించిన విశాఖపట్నంలో పోలీసులు గుర్తించారు. అయితే, అతనికి ఐసిస్తో సంబంధాలు లేవని చెబుతున్నారు. కాగా, ఆదిలాబాదు జిల్లాలోని మంచిర్యాలకు చెందిన 27 ఏళ్ల మొహమ్మద్ వాసీం ఐసిస్లో చేరి సిరియాలో మరణించినట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ఇంకా ఐసిస్లో పనిచేస్తున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 37 మందికి మత పెద్దల ద్వారా, సామాజిక గ్రూపుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించి వారిని దారి మళ్లించారు. అయితే, వీరిలో ఎక్కువ మంది తెలంగాణకు చెందినవారు కావడం గమనార్హం.
రెండు రాష్ట్రాల్లోనూ ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్న 27 సంఘటనలు నిఘా సంస్థల దృష్టిలో ఉన్నట్లు సమాచారం. హైదరాబాదు, దాని పరిసర ప్రాంతాల్లోనే కాకుండా ఐసిస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications