ఏపీలో కొత్తగా 50 లోపే కొత్త కరోనా కేసులు..ఏ జిల్లాలో ఎన్నంటే? ఆ 4 జిల్లాల్లో కేసుల్లేవ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 15 రోజులుగా 100 లోపే నమోదవుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా మరింత తగ్గాయి. గత 24 గంటల్లో 18,834 నమూనాలను పరీక్షించగా.. 30 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వివరాలను వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 30 కరోనా కేసులు
తాజాగా నమోదైన 30 కరోనా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,899కు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనాతో చికిత్స పొందుతూ కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7163కు చేరింది.
ఏపీలో 695 తగ్గిన యాక్టివ్ కేసులు
ఇక ఒక్కరోజు వ్యవధిలో 69 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 8,81,041కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 695 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,35,65,062 పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ఏపీలో జిల్లాలవారీగా కరోనా కేసులు
ఏపీలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలు జిల్లాలవారీగా ఇలా ఉన్నాయి. అనంతపురంలో 2, చిత్తూరులో 4, తూర్పుగోదావరిలో 3, గుంటూరులో 5, కడపలో 7, కృష్ణాలో 2, నెల్లూరులో 4, విశాఖపట్నంలో 2, పశ్చిమగోదావరి జిల్లాలో 1 కేసు నమోదైంది. ఇక కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
దేశంలో క్రమంగా తగ్గుతున్న యాక్టివ్ కేసులు
మరోవైపు దేశంలోనూ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 4,86,122 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 11,649 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజు వ్యవధిలో 90 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 1,55,732కు చేరింది. దేశంలో ప్రస్తుతం 1,39,637 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 1.06 కోట్ల మంది కోలుకున్నారు.
మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 82,85,295 కరోనా వ్యాక్సిన్ అందించారు.