మేడిపల్లి గ్యాంగ్రేప్: ప్రధాన నిందితుడు అరెస్ట్(ఫొటో)
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం నారపల్లి వద్ద ఓ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసులు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతని పేరు రవి. సికింద్రాబాద్లో పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం భర్త, మరిదితో కలిసి మహిళ ఆటోలో భువనగిరి వెళ్తుండగా ఐదు ఆటో డ్రైవర్లు నారపల్లి వద్ద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అంతక ముందు ఈ అత్యాచారం కేసులో నలుగురు నిందితులను మేడిపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. మేడిపల్లి ఠాణాలో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మల్కాజిగిరి జోన్ డిసిపి కె కోటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి ఉప్పల్ క్రాస్రోడ్స్ వద్ద భువనగిరికి వెళ్లేందుకు భార్యాభర్తలు బంధువుతో కలసి ఓ ఆటో ఎక్కారు.
మేడిపల్లి పిఅండ్టి కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ రవి (23), అతని సహచరులైన నారపల్లికి చెందిన ఇమ్ము అలియాస్ అక్రమ్ (22), అబ్బాస్ (24), జుబ్బేర్ (22), ఘట్కేసర్కు చెందిన షానవాజ్ (20) తమ ఆటోలో వెంబడించారు. నారపల్లి వద్ద ఆ ఆటోను ఓవర్టేక్ చేశారు. రోడ్డుకు ఆటోను అడ్డంగా పెట్టి ఆ ఆటోను ఆపేశారు. మహిళను తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్, అతని వెంట ఉన్న మరో వ్యక్తితో గొడవపడి కొట్టారు. దాంతో వాళ్లిద్దరూ భయపడి దంపతులను, వాళ్ల బంధువును అక్కడే దింపేసి వెళ్లిపోయారు. గొడవ గురించి బాలస్వామి అనే లేబర్ కాంట్రాక్టర్కు మహిళ భర్త సెల్ఫోన్లో సమాచారమందించాడు.
వెంటనే బాలస్వామి అక్కడికి రాగా అతనిపై కూడా దాడి చేశారు. బాలస్వామి అక్కడినుంచి వెళ్ళిపోయి 100 నంబర్కు ఫోన్ చేశాడు. అప్పటికే ఐదుగురు దుండగులు మహిళతో పాటు ఆమె భర్త, బంధువును ఆటోలో అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. ఆమె భర్త, బంధువును భయభ్రాంతులకు గురిచేశారు. ఇద్దరు వీరిని పట్టుకోగా మిగతా వాళ్లు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత మిగతా ఇద్దరు కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. వాళ్ల వద్ద ఉన్న మూడు వేల నగదు, సెల్ఫోన్ లాక్కున్నారు.
అంతలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వాళ్లను చూసిన దుండగులు పరారయ్యారు. సంఘటనా స్థలంలో దొరికిన ఆటో ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు బుధవారం ఉప్పల్ బస్టాండ్ వద్ద అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రవి పరారీలో ఉన్నాడు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు డిసిపి కోటేశ్వరరావు తెలిపారు. డిసిపితో పాటు మీడియా సమావేశంలో మల్కాజిగిరి సబ్ డివిజన్ ఏసిపి చెన్నయ్య, మేడిపల్లి ఇన్స్పెక్టర్ రవికిరణ్ రెడ్డి, డీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ, సిబ్బంది ఉన్నారు.