పెను విషాదం: కాలేజీకని.. చెరువులో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Recommended Video
పశ్చిమగోదావరి: జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రం ఏలూరు శివారులోని పెదవేగి మండలం భోగాపురం పంచాయతీ పరిధిలో ఉన్న వట్లూరు పెద్ద చెరువులో మునిగి నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిచెందారు.
పోలీసుల, కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా కలిదిండి మండలం కొండంగి గ్రామానికి చెందిన అంకాల సాయికిరణ్ పరశురామ్(22), కామవరపుకోట మండలం కొత్తూరుకు చెందిన కె హరికృష్ణరాజు(22), చింతలపూడికి చెందిన గుమ్మి విజయశంకర్(22)లు ఏలూరులోని రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు.
కాలేజీకని చెప్పి..
కాగా, చింతలపూడికి చెందిన కోటసాయి(21) ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వీరంతా స్నేహితులు. ప్రతీరోజూ తమతమ గ్రామాల నుంచి కళాశాల బస్సులో వచ్చి సాయంత్రం ఇళ్లకు వెళ్లిపోతారు. ఈ నేపథ్యంలో శనివారం కళాశాలకని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన వీరు.. కళాశాలకు వెళ్లకుండా సరదాగా షికారుకు ఏలూరు శివారులోని వట్లూరు పెద్ద చెరువు ప్రాంతానికి వెళ్లారు.
భోజనం చేసి చెరువులో ఈతకు..
ఆ చెరువు పక్కనే ఉన్న జామతోటలో సరదాగా కొంతసేపు గడిపారు. తమతోపాటు తెచ్చుకున్న భోజనం చేశారు. ఆ తరువాత దగ్గరలోని చెరువులోకి ఈతకొట్టేందుకు దిగారు. చెరువు లోతుగా ఉండటంతో ఈ నలుగురు నీటిలో మునిగి మృతిచెందారు. చెరువు ఊరికి బాగా దూరంగా ఉండటం, ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకపోవడంతో ఈ విషయం ఆదివారం ఉదయానికి గాని వెలుగు చూడలేదు.
చెరువులో తేలిన మృతేదేహాలు..
చెరువులో మృతదేహం తేలి కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఏలూరు డీఎస్పీ కె ఈశ్వరరావు చెరువు గట్టుమీద కొన్ని దుస్తులు, జామతోటలో విద్యార్థుల గుర్తింపుకార్డులు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
గుర్తుంపు కార్డుల సాయంతో..
నాలుగు కాలేజీ గుర్తింపుకార్డులు దొరకడంతో చెరువులోకి నలుగురు విద్యార్థులు దిగి ఉంటారని భావించి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను వెలికితీసే బృందాన్ని రంగంలోకి దించారు. స్థానికుల సహాయంతో వారు విజయశంకర్, కోటసాయి, పరశురామ్, హరికృష్ణంరాజు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. పోలీసులు కళాశాల యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కళాశాలకంటూ వెళ్లిన తమ కుమారులు ఇలా విగతజీవులుగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
మద్యం తాగారా?
నాలుగు మృతదేహాలను అంబులెన్స్లలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కాగా, ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులకు.. చెరువు పక్కనే ఉన్న జామతోటలో విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు, భోజనం బాక్సులు, కొన్నిరకాల పండ్లు, మద్యం బాటిళ్లు, మంచినీళ్ల ప్యాకెట్లు లభించాయి. దీంతో విద్యార్థులు నలుగురు మద్యం తాగి ఆ మత్తులో చెరువులోకి దిగారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు విద్యార్థులు చెరువులోకి దిగాక మునిగిపోవడాన్ని గమనించిన నాలుగో విద్యార్థి రక్షించడానికి దుస్తులతో సహా చెరువులోకి దిగినట్లు భావిస్తున్నారు. కాగా, ఘటనపై ప్రిన్సిపల్ సంజయ్ మాట్లాడుతూ.. మృతిచెందిన విద్యార్థులు శనివారం కళాశాలకు హాజరుకాలేదని తెలిపారు.