విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం;ట్రావెల్ బస్సు బోల్తా:40 మందికి గాయాలు
విశాఖపట్టణం:విశాఖ నగర శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్ఏడీ జంక్షన్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్నలారీని ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా వీరందరూ గాయపడినట్లు తెలుస్తోంది. వీరిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
తెల్లవారుఝామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి విజయనగరం జిల్లా రాజాంకు వెళుతున్న శ్రీ వెంకట రమణ ట్రావెల్స్ బస్సు ఎన్ ఎడి జంక్షన్ మీదుగా ప్రమాణిస్తున్న సమయంలో, మర్రిపాలెం వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చింది. దీంతో లారీని ఢీ కొట్టకుండా ఉండేందుకు బస్సు ఢ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా, బస్సు అప్పటికే లారీని ఢీ కొట్టి తిరగబడింది.
దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి గాయాలుకాగా, 20 మందికి పెద్ద దెబ్బలే తగిలాయని, వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. గాయపడిన వారినందరిని విశాఖ కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అంతకుముందే విశాఖ నగర శివార్లకు చెందిన ప్రయాణికులు కొంతమంది తమ గమ్యస్థానాల వద్ద దిగిపోవడంతో వారంతా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. ఈ యాక్సిడెంట్ కారణంగా ఎన్ఏడీ జంక్షన్ లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.