గుంటూరులో కలుషిత నీరు తాగా 40 మంది అస్వస్థత
గుంటూరు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసిన నీరు కలుషితమవ్వడంతో ఆ నీటిని తాగి 40 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. స్థానిక బసవ తారకరామ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
అమరావతి: గుంటూరు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసిన నీరు కలుషితమవ్వడంతో ఆ నీటిని తాగి 40 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. స్థానిక బసవ తారకరామ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం మున్సిపల్ కుళాయి ద్వారా సరఫరా అయిన నీటిని బసవ తారకరామ నగర్ వాసులు రోజులాగే పట్టుకొని తాగారు.
తాగిన కొంతసేపటి నుంచే పలువురికి విరేచనాలు, వాంతులు కావడంతో బాధితులందరినీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో చిన్నారులు,మహిళలు కూడా ఉన్నారు. వీరందరికి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నగర శివారు ప్రాంతాల పట్ల మున్సిపల్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమకు వారానికి ఒకటి రెండ్రోజులే తాగునీరు సరఫరా చేస్తారని, అదికూడా స్వచ్ఛమైన నీటిని ఇవ్వకుండా ఇలా కలుషిత నీటిని సరఫరా చేయడమేమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకు సరఫరా అవుతున్న నీరు దుర్వాసన వస్తుందని వారం రోజులుగా మున్సిపల్ సిబ్బందికి చెబుతున్నా కనీసం పట్టించుకోలేదని చెప్పారు.ఇక ప్రజాప్రతినిధులు కూడా ఎన్నికలప్పుడు తమకు 24 గంటలూ స్వచ్ఛమైన తాగునీరందిస్తామని చెప్పి, ఇప్పడు కనీసం తమకు తాగునీరు అందుతున్నాయో లేదో , ఎలాంటి నీరు సరఫరా అవుతుందో కూడా పట్టించుకునే నాధుడు లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.