తెలంగాణతో రగడకి తెర, కేంద్రంప్లాన్: ఏపీకి 480సీట్లు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదానికి ముగింపు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిట్ సీట్ల వ్యవహారానికి కేంద్రం సామరస్యపూర్వక పరిష్కారం కనుగొన్నట్లు తెలుస్తోంది. ఏ రాష్ట్రానికీ ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకొందని సమాచారం.
ఇందులో భాగంగా ప్రస్తుత వరంగల్ నిట్లో 50శాతం సీట్లను పూర్తిగా తెలంగాణకే కేటాయించాలని, ప్రతిగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా ఈ ఏడాదే ఏర్పాటు చేసిన నిట్లో సీట్లను 480కి పెంచాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
దీంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు స్థానిక రాష్ట్ర కోటా కింద యాభై శాతం సీట్లు.. అంటే 240 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా ఏర్పాటైన నిట్కి సాధారణంగా 90 లేదా 120 సీట్లను కేటాయిస్తారు. అలా ఇస్తేఏపీకి 45 లేదా 60 సీట్లు మాత్రమే స్థానిక కోటా కింద వస్తాయి.
అయితే, తెలుగు రాష్ట్రాల మధ్య గొడవను పరిష్కరించే ఉద్దేశ్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మధ్యేమార్గంగా ఏపీ నిట్ సీట్ల సంఖ్యను 480కి పెంచాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అందువల్ల ఇటు ఏపీకి, అటు తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదు. వరంగల్ నిట్లో తమకు సీట్లు కావాలని ఏపీ కోరగా, తెలంగాణ అంగీకరించలేదు. దీంతో సమస్యను కేంద్రం ఇలా తీర్చింది.