రూ.5 కోట్లతో చంద్రబాబుకు ఆధునాతన బుల్లెట్ ప్రూఫ్ బస్సు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నూతన బస్సు వచ్చింది. రూ.5 కోట్లతో ఆధునాతన సౌకర్యాలతో తయారైన బస్సును సిఎం చంద్రబాబు శుక్రవారం నాడు పరిశీలించారు. దీనిని జిల్లా పర్యటనల్లో ఉపయోగించనున్నారు.
చంద్రబాబు జిల్లా పర్యటనల కోసం ఏపీ ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన ఈ బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఉదయం విజయవాడ చేరుకుంది. ప్రస్తుతం చంద్రబాబు విజయవాడలో ఉన్నారు. దీంతో ఆయన దానిని పరిశీలించారు. తన సంతృప్తిని వ్యక్తం చేశారు.
జిల్లాల పర్యటనల సందర్భంగా అన్ని సౌకర్యాలతో ప్రత్యేకంగా బస్సును తయారుచేయాలన్న చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్టీసీ అధికారులు బెంజ్ కంపెనీకి చెందిన బస్సును కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఛండీగఢ్లో దానిని బుల్లెట్ ప్రూఫ్గా తీర్చిదిద్దించారు.
మిలిటరీకి చెందిన భారీ వాహనంలా కనిపించే ఈ వాహనం శక్తివంతమైన బాంబు దాడులను కూడా తట్టుకుని నిలుస్తుందని తెలుస్తోంది. ఈ బస్సు నిర్వహణ బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీ అధికారులకు అప్పగించారు.