5గురు అరెస్ట్, పర్యాటకులేనని తేల్చిన ఎస్పీ: తిరుపతిలో 'ఉగ్ర'కలకలం, రెక్కీ?
విశాఖ: ఏపీలోని విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని కాగిత (వేంపాడు) టోల్గేటు వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురు విదేశీయులను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు ఇరానీయులుగా తెలుస్తోంది.
ఒడిశా పోలీసుల ముందస్తు సమాచారంతో టోల్గేట్ల వద్ద పోలీసులు మోహరించి వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఒడిశా నుంచి విశాఖ మీదుగా రాజమండ్రి వైపు.. ఢిల్లీ రిజిస్ట్రేషన్తో ఉన్న 'డీఎల్ 6సీ జే 1520' నంబరు కారులో వెళ్తున్న ఇరాన్ దేశానికి చెందిన ఇద్దరు మహిళలను, ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు.
వీరిని నక్కపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అటు నుంచి విశాఖకు తరలించారు. వారి వాహనంలో ఏమీ లేవని, పర్యాటక వీసాతో వారు వచ్చినట్లు తెలుస్తోంది. వారి పాస్పోర్టులు, వీసాలు అసలువా? నకిలీవా? అనేది ఆరా తీస్తున్నారు.
విశాఖలో ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఒడిశాలోని భువనేశ్వర్లో హోటల్ గది కోసం ప్రయత్నించి అక్కడి సిబ్బంది గుర్తింపు పత్రాలు చూపమనడంతో పరారై విశాఖ పోలీసులకు చిక్కిన ఇరాన్ దేశస్థులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఏపీ, ఒడిశా పోలీసులు, నిఘా వర్గాలు, కేంద్ర దర్యాప్తు, నిఘా బృందాలు అత్యంత చాకచక్యంగా వ్యవహరించాయి.
భువనేశ్వర్ నుంచి విశాఖ జిల్లా నక్కపల్లి వరకూ అడగడుగునా వారి కదలికలను పరిశీలించారు. తొలుత భువనేశ్వర్లోని హోటల్లోని నిఘా కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా అనుమానితులను గుర్తించిన నిఘా బృందాలు వారు ఏపీ వైపు వచ్చే అవకాశముందని భావించి, ఏపీ పోలీసులను అప్రమత్తం చేశాయి.
రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై ఉన్న అన్ని టోల్గేట్లనూ అప్రమత్తం చేశారు. సోమవారమే భువనేశ్వర్లో వీరి ఉనికి బయటపడగా అనంతరం మంగళవారం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు వీరు శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నట్లు టోల్గేట్ల వద్ద సమాచారం ఆధారంగా తెలుస్తోంది.
మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నాతవలస టోల్గేట్ను దాటి విశాఖ వైపు వెళ్లినట్లు తెలియడంతో నక్కపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఇరాన్ దేశస్థులు ఉగ్రవాదులై ఉంటారన్న అనుమానంతో అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. వారు తొలుత ఇరాన్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి భువనేశ్వర్కు చేరుకుని, ఏపీలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని సమాచారం.
వారు పర్యాటకులే: ఎస్పీ
తాము అదుపులోకి తీసుకున్న ఐదుగురు అనుమానితులను విశాఖ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ పర్యాటకులుగా నిర్ధారించారు. వనక్కపల్లి మండలం కాగిత (వేంపాడు) టోల్ గేటు వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురు విదేశీయులను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర నిఘా బృందం కూడా ఇరాన్ దేశీయుల వద్ద ఆధారాలను పరిశీలించిందని, ఒడిశా పోలీసులు ఎందుకు వారిని అనుమానించారో తెలియాల్సి ఉందని ఎస్పీ తెలిపారు.
తిరుపతిలో ఉగ్ర కలకలం
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ఉగ్రవాదుల కలకలం రేగింది. ఐఎస్ఐకి చెందిన ఉగ్రవాది నగరంలోకి చొరబడ్డాడన్న విశ్వసనీయ సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు రంగంలోకి దిగిపోయారు. ఇటీవల బెంగళూరులో అరెస్టైన తీవ్రవాది ఒకడు విచారణలో భాగంగా తిరుపతిలోకి ప్రవేశించిన మరో ఉగ్రవాదికి సంబంధించిన సమాచారం ఇచ్చాడు.
దీంతో వెనువెంటనే రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు తిరుపతికి వచ్చారు. నగరవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా సోమవారం ఉదయం తిరుమల భక్తుల విడిది కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన విష్ణునివాసం ఎదురుగా ఉన్న డ్రెయినేజీలో ఎన్ఐఏ అధికారులు రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
తుపాకుల లభ్యంతో ఉగ్రవాది సంచారాన్ని నిర్ధారించుకున్న ఎన్ఐఏ అధికారులు సోదాలను మరింత ముమ్మరం చేశారు. ఉగ్రవాది దాచిన బ్యాగ్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారని తెలుస్తోంది. గతంలో బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తి రెక్కీ నిర్వహించాడు.