అమరావతిలో 50 అంతస్తుల ఏపీ సచివాలయం: 47 లేదా 48వ అంతస్తులో సిఎం ఆఫీస్
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, సచివాలయాలను ప్రపంచస్థాయి కట్టడాలుగా నిర్మించాలని సీఆర్డీఏ(క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) భావిస్తోంది. వీటిలో సచివాలయాన్ని 50 అంతస్తుల్లో విశాలమైన గదులతో నిర్మించనుంది. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని 47 లేదా 48వ అంతస్తులో నిర్మించనుంది.
ఈ మేరకు ఇప్పటికే డిజైన్ను రూపొందించేందుకు కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. రెండు మూడు రోజుల్లో వీటిలో ఒక దానికి భవన డిజైన్ రూపొందించే బాధ్యత ఇవ్వనున్నారు. అసెంబ్లీని కూడా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా నిర్మించాలని భావిస్తున్నారు.
అదే సమయంలో అమరావతిలో ఫేజ్-1 భాగమైన అసెంబ్లీ, సచివాలయం, ప్రధాన కార్యాలయాలు, ఉద్యోగుల గృహాలు తదితర భవనాల నిర్మాణ కార్యక్రమాలను త్వరితగతిన చేపట్టేందుకు సీఆర్డీఏ సన్నద్ధమవుతోంది.
ఈ మేరకు సింగపూర్ ప్రతినిధులతో గురువారం సీఆర్డీఏ కార్యదర్శి అజయ్ జైన్ సమావేశమయ్యారు. సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్పై చర్చించారు. స్విస్ చాలెంజ్ విధానంలో నిర్మాణ బాధ్యతలను అప్పగించడానికి ముందుగా, ఫేజ్-1లో కావాల్సిన అవసరాలను స్పష్టం చేసేందుకు సమగ్ర ప్రణాళికను అందించాలని సింగపూర్ ప్రతినిధులను అజయ్ జైన్ కోరారు.
ఇది ఇలా ఉండగా, ఏపీ రాజధాని అమరావతికి అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఒకే దఫా తరలించాలా?, లేక విడతల వారీగానా? అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.
ఉద్యోగ సంఘాల నేతల సమావేశంలో ఈ విషయమే చర్చించామని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. అన్ని శాఖలనూ ఎంత సమయంలోపు తరలించాలి? ఎలా తరలించాలి? అనే అంశాలను నిర్ణయించడంలో సంఘాలను భాగస్వాములను చేస్తామని వివరించారు.