శిశువు మృతి ఎఫెక్ట్: జిజిహెచ్లో భారీగా ఎలుకల పట్టివేత
గుంటూరు: జనరల్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న పసికందును ఎలుకలు కొరకడంతో మరణించిన ఘటనతో మేల్కొన్న ప్రభుత్వం.. ఆస్పత్రిలో భారీ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పసికందు మృతిపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఆస్పత్రి ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధమైంది.
తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రత్యేకంగా ఎలుకలు పట్టేవాళ్లను పిలిపించారు. మొత్తం పదిమందితో కూడిన ఓ బృందం ఆస్పత్రికి చేరుకుని, తమదైన పద్ధతిలో బోనులు, ఎరలు ఏర్పాటుచేసింది. దీంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50 వరకు ఎలుకలు పట్టుబడ్డాయి.
వాళ్లు పట్టుకున్న ఎలుకలను చూసి.. అసలు ఇది గుంటూరు ప్రభుత్వాస్పత్రేనా.. మరేదైనానా అని అంతా విస్తుపోయారు. ప్రభుత్వం ఆదేశాలతో ప్రస్తుతం ఆస్పత్రి మొత్తాన్ని శుభ్రం చేయించే పనిలో పడ్డారు అధికారులు.
జిజిహెచ్ సూపరింటెండెంట్ బదిలీ
గుంటూరు జీజీహెచ్లో ఎలుకల దాడిలో బాలుడు మృతిచెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ వేణుగోపాలరావు, పీడియాట్రిక్ సర్జన్ భాస్కర్రావును బదిలీ చేశారు. స్టాఫ్ నర్సు విజయలక్ష్మి, హెడ్ నర్సు విజయనిర్మలను సస్పెండ్ చేశారు. ప్రాథమిక నివేదిక అందిందని ఆయన తెలిపారు. వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆయన అన్నారు.
అంతకుముందు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్వయంగా కలెక్టర్, సూపరింటెండెంట్ వేణుగోపాల్రావుతో కలిసి ఆస్పత్రిని పరిశీలించారు. ప్రభుత్వాస్పత్రిలో వేస్ట్ మేనేజ్మెంట్పై అధ్యయనం కోసం ఎంపీ గల్లా జయదేవ్ ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించారు.
కాగా, పసికందు మృతికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. ఘటనపై క్రిమినల్ కేసును నమోదు చేసినట్లు కొత్తపేట సిఐ వెంకన్న తెలిపారు. అయితే ఇందులో ఎవరిని బాధ్యులను చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.