ఈ నెలాఖరుకు ముసాయిదా బడ్జెట్...మార్చి మాసాంతానికి తుది బడ్జెట్: మంత్రి యనమల
మచిలీపట్నం: ఎపిలో బడ్జెట్ హడావుడి మొదలైంది. ఈ నెలాఖరుకే ముసాయిదా బడ్జెట్...మార్చి మాసాంతానికే తుది బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి యనమల తెలిపారు. ఈ బడ్జెట్ బాసట సంక్షేమ రంగానికేనని ఆర్థిక మంత్రి తేల్చి చెబుతున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో అధికార పార్టీకి అత్యంత కీలకమైన ఈ బడ్జెట్ లో కేటాయింపులు ఎలా ఉంటాయోనని రాజకీయ పరిశీలకులు చర్చించుకుంటున్నారు.
కేంద్రం తరహాలోనే ఎపిలోను రాష్ట్ర బడ్జెట్ ను ముందుగానే ప్రవేశపెట్టదలిచామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మచిలీపట్నంలో యువకెరటాలు కార్యక్రమం ప్రారంభోత్సవం అనంతరం మంత్రి యనమల బడ్జెట్ సమచారం వెల్లడించారు. ముసాయిదా బడ్జెట్ ఈ నెలాఖరుకు తయారవుతుందని, మార్చి మొదటివారంలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయని మంత్రి యనమల చెప్పారు. తుది బడ్జెట్ను మార్చి నెలాఖరుకు ప్రవేశపెడతామన్నారు.
ముసాయిదా...బడ్జెట్...
సంక్రాంతి పండుగ తర్వాత మంత్రులు, ఆర్థిక నిపుణులు, కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించి ముసాయిదా బడ్జెట్ను రూపొందిస్తామని యనమల వివరించారు. మొత్తం మీద జనవరి నెలాఖరుకు ముసాయిదా ప్రతి సిద్దమవుతుందని మంత్రి యనమల వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలన తర్వాత తుది బడ్జెట్ను మార్చి నెలాఖరుకు ప్రవేశపెడతామన్నారు.
ముందుగానే...బడ్జెట్...
జనవరి - డిసెంబరు కాలాన్ని పరిగణనలోకి తీసుకుని బడ్జెట్లు రూపొందించాలన్న ప్రతిపాదనలు వచ్చినప్పటికీ గత పద్ధతినే అవలంబించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. అందువల్ల కేంద్రం తరహాలోనే మన రాష్ట్రంలోనూ బడ్జెట్ ను ముందుగానే ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.
సంక్షేమానికే...పెద్ద పీట...
2017-18 బడ్జెట్ రూ.1.56 లక్షల కోట్లు కాగా ఇందులో 40 శాతం నిధులు సంక్షేమానికే కేటాయించామన్నారు. అలాగే ఈసారి 201819 బడ్జెట్ లో 50 శాతం కేటాయింపులు సంక్షేమ రంగానికేనని మంత్రి యనమల స్పష్టం చేశారు. సంక్షేమం తరువాత ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు.
సిఎం కృషికి...దోహదం...
రాష్ట్రంలో పేదరికం, ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిచేస్తున్నారని, అందుకు దోహదపడేవిధంగా ఈసారి బడ్జెట్ ఉంటుందని యనమల తెలిపారు. అలాగే బడ్జెట్లో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. వ్యవసాయం కీలకమని చెబుతూ ఈ ఏడాది 29 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు.
కీలక బడ్జెట్...
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ బడ్జెట్ లో కేటాయింపులు తదనంతరం వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపడం ఖాయమనే పరిస్థితుల్లో అధికారపార్టీ టిడిపికి ఈ బడ్జెట్ అత్యంత కీలకం కానుంది. మరి రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు, ఆర్థిక నిపుణుడు యనమల రామకృష్ణుడు రూపొందించే డ్రీమ్ బడ్జెట్ రాష్ట్ర ప్రజలను ఏమేరకు మెప్పిస్తుందో వేచిచూడాలి.