హైద్రాబాద్ టు అమరావతి: 502సైకిళ్లపై టెక్కీల సైకిల్ యాత్ర, పెద్దమ్మగుడి మట్టి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విజయవంతం కావాలని కోరకుంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో మహాసంకల్ప యాత్ర చేపట్టారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి అమరావతి వరకు వరకు జరగనున్న ఈ ర్యాలీ ప్రారంభమైంది.
చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన 502 రోజులు పూర్తయిన సందర్భంగా 502 సైకిళ్లతో ఈ ర్యాలీ చేపట్టారు. తద్వారా అమరావతిలో ప్రపంచస్థాయి రాజధాని నిర్మించేందుకు సన్నద్ధమవుతున్న ఏపీ సీఎం చంద్రబాబుకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది.
అమరావతి నిర్మాణానికి సంఘీభావం ప్రకటించేందుకు ఐటీ ఉద్యోగులు సైకిల్ యాత్ర చేపట్టారు. వీరి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి అమరావతి వరకు సాగే ఈ సైకిల్ యాత్రను టిడిపి నేతలు పయ్యావుల కేశవ్, మాగంటి గోపీనాథ్, వేం నరేందర్ రెడ్డి తదితరులు సోమవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు అధికారం చేపట్టి 502 రోజులు పూర్తయిన సందర్భంగా 502 మంది ఐటీ ఉద్యోగులు, 502 సైకిళ్లలో 502 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టారు. రాష్ట్రంలో సేకరించిన పవిత్ర మట్టిని, జలాన్ని, నవధాన్యాలను వెంట తీసుకెళ్లారు.
ఈ నెల 21వ తేదీ రాత్రికి సైకిల్ యాత్ర అమరావతికి చేరుకుంటుంది. యాత్ర సందర్భంగా నాగార్జునసాగర్, ధరణికోట ప్రాంతాల్లో పవిత్ర జలాలను, మట్టిని సేకరించి అమరావతి శంకుస్థాపనకు తీసుకెళ్లనున్నట్లు ఐటీ ఉద్యోగులు తెలిపారు.
అమరావతికి పెద్దమ్మ గుడి మట్టి
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి వద్ద మన మట్టి - మన నీరును టిడిపి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సేకరించారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన మట్టి, నీటిని సాయంత్రం హిమయత్ నగర్లోని టిటిడి కళ్యాణ మండపానికి తీసుకు రానున్నారు.
పూజల అనంతరం మట్టి, నీటిని అమరావతికి తరలిస్తారు. అజ్మీరా దర్గాలో ఏపీ మంత్రి తోట నర్సింహం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కటి మట్టిని, నీటిని సేకరించారు. టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు యాదాద్రి నుంచి మట్టి, నీరును సేకరించారు. వీటిని అమరావతికి ఆయనే స్వయంగా తీసుకెళ్లనున్నారు.