పోలవరంలో మెడికల్ ఎమర్జెన్సీ.. మలేరియా మందులు వికటించి 52 మందికి అస్వస్థత!
పోలవరం జిల్లాలోని గొల్లగుప్ప గ్రామంలో మలేరియా నివారణ మందుల (క్లోరోక్విన్) వికటన ఘటన తీవ్ర కలకలం రేపింది. సంఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో వేర్వేరుగా అత్యవసర సమీక్ష నిర్వహించారు. మందులు వికటించి ఒక బాలిక మృతి చెందిందనే సమాచారం అందుకోవడంతో సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. బాధితులకు తక్షణమే అత్యుత్తమ వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎంతో పాటు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
గ్రామంలో మొత్తం 71 మందికి మలేరియా నివారణ మందులు పంపిణీ చేయగా, వాటి ప్రభావంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమై గ్రామంలో అత్యవసర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అస్వస్థతకు గురైన వారిలో 47 మంది చిన్నారులతో సహా మొత్తం 52 మందికి తెలంగాణలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మరో 24 మందికి స్థానిక లక్ష్మీపురం పీహెచ్సీలో వైద్య సేవలు అందిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న భద్రాచలం ఆసుపత్రికి చింతూరు ఐటీడీఏ పీవో, ఏఎస్పీ సహా ఇతర అధికారులు స్వయంగా వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

అసత్య ప్రచారాలు నమ్మొద్దు!
భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 52 మందికి మలేరియా ఆర్డీటీ పరీక్షలు నిర్వహించగా, వారిలో ఆరుగురికి మలేరియా పాజిటివ్గా తేలిందని వైద్యులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారందరికీ తగిన యాంటీ మలేరియా చికిత్సను ప్రారంభించినట్లు మంత్రి సత్యకుమార్కు అధికారులు నివేదించారు. ముందు జాగ్రత్త చర్యగానే బాధితులందరినీ మెరుగైన వైద్యం కోసం దగ్గర్లోని ఏరియా ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి పూర్తి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, ప్రజలు ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని అధికారులు స్పష్టం చేశారు.
విజయవాడ, రాజమండ్రి నుంచి ప్రత్యేక వైద్య బృందాలు రంగంలోకి
ఈ ఘటనపై ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. కాకినాడ జీజీహెచ్ నుంచి 9 మంది సభ్యులతో కూడిన నిపుణులైన వైద్య బృందాన్ని వెంటనే గొల్లగుప్పకు తరలించారు. వీరితో పాటు విజయవాడ, రాజమండ్రి, కాకినాడ నుంచి మరో మూడు ప్రత్యేక వైద్య బృందాలు బయలుదేరినట్లు కలెక్టర్ వివరించారు. ఇప్పటికే ఆర్ఆర్టీ, ఆర్ఎంసీ కాకినాడ, జీఎంసీ రాజమండ్రి బృందాలు భద్రాచలం ఆసుపత్రిని సందర్శించి బాధితులకు చికిత్స అందిస్తున్నాయి.
వైద్య సేవలపై సీఎం, మంత్రి కఠిన ఆదేశాలు
రాష్ట్ర అదనపు డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ అర్జునరావుల ప్రత్యక్ష పర్యవేక్షణలో వైద్య సేవలు వేగవంతంగా సాగుతున్నాయి. గొల్లగుప్ప గ్రామంలో 24 గంటలూ వైద్య సేవలు నిరంతరం కొనసాగాలని, ఆసుపత్రిలో చేరిన వారికి ఎలాంటి లోటు రాకుండా మెరుగైన చికిత్స అందించాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. బాధితులందరూ పూర్తిగా కోలుకునే వరకు వైద్య బృందాలు అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications